త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లింల అరెస్ట్
ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు
By అంజి Published on 17 May 2023 7:30 AM IST
త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లింల అరెస్ట్
ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. ఆలయ ట్రస్టు ఫిర్యాదు మేరకు నిందితులు అకిల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకిల్ సయ్యద్, మతిన్ రాజు సయ్యద్, సలీం బక్షు సయ్యద్లను మంగళవారం అరెస్టు చేశారు. మే 13న నలుగురు వ్యక్తులు ఊరేగింపులో భాగంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి, శివలింగానికి చాదర్ సమర్పించడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. గొప్ప ముస్లిం సాధువుల ఉర్స్ (వర్థంతి)లో భాగంగా వారి గౌరవార్థం చెప్పుల ఊరేగింపు జరుగుతుంది.
శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర్ ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది. గుంపును పవిత్ర స్థలంలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్గా మారాయి. ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు.. ఏళ్ల తరబడి గంధం రోజు శివుడికి చాదర్ చూపిస్తున్నామని, గుడి లోపలికి వెళ్లడం లేదని ఊరేగింపు నిర్వాహకుడు మతిన్ సయ్యద్ తెలిపారు. నిందితులు శివలింగానికి చాదర్ సమర్పించడానికి ప్రయత్నించలేదని, వారు చాదర్ను ఆలయ మెట్ల వరకు మాత్రమే తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.
ఆలయ ట్రస్టు ఫిర్యాదు మేరకు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 295, 511 కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.