మేజిస్ట్రేట్ ముందు మౌనంగా ఉన్న నిందితులు.. హనీమూన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్
మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat
మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురితో కలిసి తన భర్త రాజా రఘువంశీని హత్య చేసింది. ఇద్దరు నిందితులు తమ పూర్వపు ఒప్పుకోలు ఉపసంహరించుకుని మేజిస్ట్రేట్ ముందు మౌనం వహించడంతో ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది.
ఈ హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని మేఘాలయ పోలీసులు చెప్పారు.. వీరిలో ఇద్దరు నిందితులు ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మీలు గురువారం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. NDTV ప్రకారం.. షిల్లాంగ్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెర్బర్ట్ ఖార్కోంగోర్ మాట్లాడుతూ.. నిందితులిద్దరూ మౌనంగా ఉన్నారని.. ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హెర్బర్ట్ అధిపతి.
ఖార్కోంగోర్ మాట్లాడుతూ.. "మేము ఐదుగురు నిందితులలో ఇద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాము. వారు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. కానీ వారికి వ్యతిరేకంగా మా వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఒప్పుకోకపోవడం వారి హక్కు. కానీ మా దగ్గర దృఢమైన సాక్ష్యాలు ఉన్నాయి.. ఇవి ఈ కేసులో చాలా ముఖ్యమైనవన్నారు.
నిందితులంతా నేరం అంగీకరించినట్లు పోలీసులు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆకాష్, ఆనంద్ వాంగ్మూలాలను ఇవ్వకపోవడంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. అయితే ఈ హత్యను నిరూపించేందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
మే 23న మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన రాజా, సోనమ్లు నోంగ్రిట్ గ్రామంలోని హోమ్స్టే నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోవడంతో కేసు ప్రారంభమైంది. జూన్ 2న ఆ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో రాజా మృతదేహం లభ్యమైంది. ఆపై కొన్ని రోజుల తరువాత సోనమ్ను ఘాజీపూర్లో పోలీసులు అరెస్టు చేశారు.