ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు

By అంజి  Published on  25 Oct 2024 2:08 AM GMT
civilians, soldiers killed, terrorists, attack, Army vehicle, Jammu Kashmir

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. వాహనం 18 రాష్ట్రీయ రైఫిల్స్ (RR)కి చెందినది. ఈ దాడిలో నలుగురు సైనికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వాహనం బోట్‌పత్రి నుండి మార్గమధ్యంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఇది నియంత్రణ రేఖ (LOC) నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఇద్దరు పౌరులు ఆర్మీలో పోర్టర్లుగా పనిచేశారు. గతంలో పలు సీమాంతర దాడులకు పాల్పడిన ప్రత్యేక విభాగాలైన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ పాత్రను తోసిపుచ్చలేమని వర్గాలు తెలిపాయి. వాహనం మారుమూల బోట్‌పత్రి ప్రాంతానికి చేరుకోగానే ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దాడిని ఖండించారు.

"ఉత్తర కాశ్మీర్‌లోని బోట్‌పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై జరిగిన దాడి గురించి చాలా దురదృష్టకరమైనది. దీని ఫలితంగా కొంత ప్రాణనష్టం జరిగింది. కాశ్మీర్‌లో ఈ ఇటీవలి వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. నేను ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉగ్రవాదులను అంతమొందించేందుకు త్వరితగతిన సమాధానం ఇవ్వాలని ఆర్మీ అధికారులను ఆదేశించారు. "బోట్‌పత్రి సెక్టార్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిపై ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు త్వరితగతిన తగిన సమాధానం చెప్పాలని ఆదేశించాను. ఆపరేషన్ పురోగతిలో ఉంది. మా అమరవీరుల త్యాగం వృథా కాదు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను, " అని మనోజ్ సిన్హా అన్నారు.

ఇటీవల కాశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడులు పెరిగాయి, తాజా దాడి గురువారం ఉదయం జరిగింది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారు. ఆదివారం గందర్‌బాల్ జిల్లాలోని నిర్మాణ స్థలంపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు స్థానికేతర కార్మికులు, స్థానిక వైద్యుడు మరణించగా, బీహార్‌కు చెందిన ఒక కార్మికుడు అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు.

Next Story