Ahmedabad Plane Crash : కూలిన విమానంలో 169 మంది భారతీయులు.. మిగిలిన వారి వివరాలివే..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
By Medi Samrat
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని మేఘనీ నగర్లోని నివాస ప్రాంతంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో విమానం కూలిపోయిన తర్వాత దట్టమైన పొగ మేఘాలు కమ్ముకుంటున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. విమానం వెనుక భాగం అంటే తోక ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విమానం ఇంజన్ అకస్మాత్తుగా పనిచేయలేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ANI ప్రకారం.. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ధృవీకరించింది. విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతుండగా.. టేకాఫ్ సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ప్రస్తుతం సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో.. ప్రమాదంపై మరింత సమాచారం అందించడానికి ప్రత్యేకమైన ప్యాసింజర్ హాట్లైన్ నంబర్ 1800 5691 444ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఎయిర్ ఇండియా తన పూర్తి సహకారాన్ని అందిస్తోంది.
విమానం AI171 మధ్యాహ్నం 1:38 గంటలకు బయలుదేరగా.. ఐదు నిమిషాల తర్వాత క్రాష్ అయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ఎయిరిండియా విమానం కూలిపోవడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. “అహ్మదాబాద్లో ఎయిరిండియా ప్యాసింజర్ విమానం కూలిపోవడం పట్ల నేను చాలా బాధపడ్డాను. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు యుద్ధప్రాతిపదికన తక్షణ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. అలాగే గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం తీసుకెళ్లేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, ప్రాధాన్యతా ప్రాతిపదికన ఆసుపత్రుల్లో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నాతో మాట్లాడి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ కమిషనర్తో విమాన ప్రమాదంపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.