మోదీ నా 15వ కుమారుడు..25 ఎకరాలు రాసిస్తా: బామ్మ వీడియో వైరల్

ప్రధాని మోదీ కూడా తనకు కొడుకు లాంటివాడని.. 15వ కుమారుడిలానే భావిస్తానని బామ్మ చెబుతోంది.

By Srikanth Gundamalla  Published on  27 Jun 2023 4:43 AM GMT
PM Modi, Old Lady, Madhyapradesh, Viral video

మోదీ నా 15వ కుమారుడు..25 ఎకరాలు రాసిస్తా: బామ్మ వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన ప్రజలకు ఎంతో చేరువ అయ్యారు. అయితే.. ఓ పెద్దావిడ మోదీపై తనకున్న ప్రేమను దేశానికి చాటిచెప్పింది. నరేంద్ర మోదీ తన కొడుకు లాంటివాడని.. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తానని చెబుతోంది. వందేళ్ల బామ్మ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన పెద్దావిడ పేరు మంగీబాయి తన్వర్. ఆమెకు 14 మంది సంతానం. ప్రధాని మోదీ కూడా తనకు కొడుకు లాంటివాడని.. 15వ కుమారుడిలానే భావిస్తానని చెబుతోంది. దేశానికి మోదీ ఎంతో సేవ చేస్తున్నారని.. అలాగే తనకూ ఎన్నో పథకాలు అందిస్తున్నారని ఆమె ప్రశంసల జల్లు కురిపించింది. తనతో పాటు దేశంలో ఉన్న ఎందరో వృద్ధులకు అండగా నిలిచి వారి అవసరాలను తీరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానని తెలిపింది. ఇంత సాయం చేస్తున్న ప్రధానికి తనకు ఉన్న 25 ఎకరాల ఆస్తిని మోదీ పేరున రాసి ఇవ్వనున్నట్లు చెప్పింది.

వైరల్‌ అవుతోన్న వీడియోలో మంగీబాయి ఇలా మాట్లాడింది.. " ప్రధాని ఫొటో చూసిన మంగీబాయి అవును ఇతడే మోదీ.. నాకు తెలుసు.. టీవీల్లో చూశాను. మోదీ నాకు ఇల్లు ఇచ్చి.. ఉచితంగా వైద్యం అందజేస్తున్నారు. వితంతు పెన్షన్ ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. తినడానికి ఆహారం అందిస్తున్నారు. ప్రధాని మోదీ వల్లే తీర్థయాత్రలకు వెళ్లగలిగా. అందుకే మోదీ నా కుమారుడు. అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉంది". అని మంగీబాయి అన్నారు. ప్రధాని మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్‌ కావడం విశేషంగా నిలిచింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. రోడ్‌షోలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ.

Next Story