విషాదం.. పిడుగుపాటుకు 10 మంది మృతి

ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు 10 మంది మృతి చెందినట్లు అధికారి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By అంజి  Published on  3 Sep 2023 6:53 AM GMT
10 killed, lightning strikes,Odisha, IMD

విషాదం.. పిడుగుపాటుకు 10 మంది మృతి

ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు 10 మంది మృతి చెందినట్లు అధికారి తెలిపారు. పిడుగుపాటుకు ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలంగీర్‌లో ఇద్దరు, అంగుల్, బౌధ్, జగత్‌సింగ్‌పూర్, ధెంకనల్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. శనివారం జరిగిన పిడుగుపాటులో ఖుర్దాలో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారని పేర్కొంది. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని అధికారి తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. తుఫాను రుతుపవనాలను సక్రియం చేసిందని, దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని ఆ ప్రకటన తెలిపింది.

జంట నగరాలైన భువనేశ్వర్, కటక్‌లలో మధ్యాహ్నం 90 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీంతో భువనేశ్వర్‌లో 126 మిమీ, కటక్‌లో 95.8 మిమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 36,597 సిసి (క్లౌడ్ టు క్లౌడ్) పిడుగులు, 25,753 సిజి (క్లౌడ్ టు గ్రౌండ్) పిడుగులు నమోదయ్యాయని ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎక్స్‌లో తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని ఇక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్‌ఆర్ బిస్వాస్ తెలిపారు. దీని ప్రభావంతో తదుపరి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.

Next Story