మమతా బెనర్జీకి షాకిచ్చిన గవర్నర్
By సుభాష్ Published on 16 Dec 2019 11:15 AM GMT
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నరు జగదీప్ ధన్ఖర్ షాకిచ్చారు. ముఖ్యమంత్రి మమతా ప్రజాధనాన్ని పార్టీ అనుకూల వాణిజ్య ప్రకటనల కోసం వెచ్చిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ఆరోపణలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించి చట్టం చేశాక, దీనికి వ్యతిరేకంగా టీవీల్లో సీఎం మమతా సర్కారు నిధులతో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆయా వాణిజ్య ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని గవర్నర్ డిమాండ్ చేశారు.
ప్రజాధనం దుర్వినియోగం చేయడమే :
పార్లమెంటు చేసిన చట్టానికి వ్యతిరేకంగా టీవీల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని, ఇది నేరమని, దీన్ని వెంటనే నిలిపివేయాలని గవర్నర్ హుకుం జారీ చేశారు. ఆ ప్రకటనల్లో మమతా జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌరసత్వ రిజిస్టరు అమలు చేయమని ప్రకటించడంతో పాటు హింసాకాండను మానుకోవాలని కోరారని గవర్నరు ధన్ఖర్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, దీన్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగానికి విరుద్ధమేనని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సీఎం మమతాబెనర్జీ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని సూచించారు.