మహారాష్ట్రలో లక్ష దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 6:00 AM GMT
మహారాష్ట్రలో లక్ష దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం కూడా భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 3,493 కేసులు నమోదు కాగా.. 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం అక్కడ 1,01,141 కేసులు నమోదు కాగా.. 3717 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 47,796 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 49616 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేష్ తొపె మాట్లాడుతూ.. తాము ప్ర‌తి ఒక్క‌రికీ ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక దేశంలో కరోన కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా చేరుకున్నాయి. 24 గంటల్లో 11,458 కేసులు నమోదు కాగా.. 386 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,08,993 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8,884మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,54,330 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,45,779 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story