ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఇంటి వద్దకే మద్యం
By సుభాష్ Published on 5 May 2020 12:16 PM GMTకరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. ఇక మూడో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక మద్యం షాపులు తెరిచేందుకు కొన్ని ప్రాంతాల్లో కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కొన్ని రాష్ట్రాలు కూడా మద్యం అమ్మేందుకు అనుమతులు ఇచ్చాయి. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని, షాపుల వద్ద ఒకే సారి ఐదుగురికంటే ఎక్కువ ఉండవద్దని సూచించినా మందు బాబులు ఆవేమి పట్టించుకోవడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఛత్తీస్గఢ్ లోని గ్రీన్జోన్ల పరిధిలో మద్యాన్ని ఇంటికే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా కరోనాను కట్టడి చేయవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.
ప్రతి వినియోగదారుడికి 5 లీటర్ల మద్యం
కాగా, ప్రతి వినియోగదారుడు 5 లీటర్ల మద్యం మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చని సూచించారు అధికారులు.ఇంటి వద్ద మద్యాన్ని డెలివరీ చేసిన సమయంలో సర్వీస్ చార్జీ కింద రూ. 120 చెల్లించాలని తెలిపారు. సీఎస్ఎంసీఎల్ ఆన్లైన్ ఆప్ ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన సమయంలో ఫోన్ నంబర్తో పాటు ఆధార్ నంబర్ ఖచ్చితమని తెలిపింది.