తెరిచిందే ఆల‌స్యం.. రూ.52వేల లిక్కర్ కొన్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2020 12:24 PM GMT
తెరిచిందే ఆల‌స్యం.. రూ.52వేల లిక్కర్ కొన్నాడు

మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారా అని మందుబాబులు దాదాపు 40 రోజులుగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో.. ప‌లు రాష్ట్రాల్లో సోమ‌వారం మ‌ద్యం దుకాణాలు తెరచుక‌న్నాయి. చాలా రోజులు మ‌ద్యం దొర‌క్క అల్లాడిపోతున్న మందుబాబులు అర్థ‌రాత్రి నుంచే దుకాణాల ముందు క్యూ క‌ట్టారు. ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా షాపులు తెరిచే వ‌ర‌కు వేచి చేశారు. దుకాణాలు అలా తెరిచారో లేదో.. మందుబాబులు పెద్ద ఎత్తున మ‌ద్యం కొనుగోలు చేశారు.

క‌ర్ణాక‌ట‌లో ఓ వ్య‌క్తి ఏకంగా రూ.52,841 విలువ మ‌ద్యం కొనుగోలు చేశాడు. చేసిన వాడు ఊరికే ఉండ‌క ఆ బిల్లును ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది క్ష‌ణాల్లో ఈ బిల్లు వైర‌ల్ అయ్యింది. ఈ విష‌యం కాస్త‌ క‌ర్ణాట‌క ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కి చేరింది. వెంట‌నే ఎక్సైజ్ అధికారులు స‌ద‌రు దుకాణానికి చేరుకుని షాప్ ఓవ‌ర్ పై కేసు న‌మోదు చేశారు.

లైసెన్స్‌ నిబంధనలు ఉల్లంఘించిన వెనీలా స్పిరీట్‌ జోన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ గిరి తెలిపారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఒక క‌స్ట‌మ‌ర్‌కు 2.6లీట‌ర్ల ఇండియ‌న్ మేడ్ ఫారెన్ లిక్క‌ర్, 18 లీట‌ర్ల బీర్ మాత్ర‌మే విక్ర‌యించాలి, కానీ వైర‌ల్ అయిన ఆ బిల్లు ప్ర‌కారం.. 17.4 లీటర్ల లిక్కర్‌, 35.7లీటర్ల బీరును ఒక్కరికే షాపు ఓనర్‌ విక్రయించారు. షాపు ఓన‌ర్‌తో పాటు బిల్లు పోస్టు చేసిన వ్య‌క్తిపై అధికారులు కేసు న‌మోదు చేశారు.

ఈ విష‌యం గురించి ఆ షాపు ఓన‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా.. 8 మంది క‌లిసి మ‌ద్యాన్ని కొనుగోలు చేశార‌ని, అయితే.. బిల్లు మాత్రం ఒకే కార్డు ద్వారా చెల్లించ‌నట్లు చెప్పాడు. దీనిపై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కర్ణాటకలో తొలిరోజు మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.45కోట్ల ఆదాయం లభించింది.

Next Story