భారత్లో కరోనా కరాళనృత్యం.. 24గంటల్లో 3900 కేసులు.. 195 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 5 May 2020 5:13 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికి రోజు రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 195 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఇన్ని కేసులు, మరణాలు నమోదు కాలేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు భారత్లో 46,433 కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 1,568 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 12,726 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 32,134 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 14,541 కేసులు నమోదు కాగా.. 583 మంది మృతి చెందారు. గుజరాత్లో 5,804 కేసులు నమోదు కాగా.. 319 మంది మరణించారు. ఢిల్లీలో 4,898 కేసులు నమోదు కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 3,550 కేసులు నమోదు కాగా.. 31 మంది మృత్యువాతపడ్డారు. రాజస్థాన్లో 3,061, మధ్యప్రదేశ్లో 2,942 కేసులు నమోదు కాగా 165మంది మరణించారు. ఏపీలో 1650కేసులు నమోదు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 1085 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 29 మంది చనిపోయారు.