ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం ఏదైనా ఇప్పుడు అందరూ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని పని చేయాల్సి వస్తోంది. కొందరు పనిలో పడి కూర్చున్న సీటు నుంచి లేవరు. ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చిన తర్వాతైనా ఎలాంటి వ్యాయామం చేయరు. సోఫా లోనో, మంచంపైనే ఏ ఫోనో చూసుకుంటూ కాలం గడిపేస్తారు. ఇలాంటి వారికి దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చొని పని చేసేవారు రోజులో కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. తగినంత శారీరక శ్రమ లేకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి అధిక బరువు, ఊబకాయానికి దారితీయవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అలాగే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి ధమనులలో పేరుకుపోయి.. రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి గుండె సమస్యలు, స్ట్రోక్, హైబీపీ సమస్యల ముప్పు పెరుగుతుంది. అందుకే ఆఫీసులో గంటకు ఒక్కసారైనా కుర్చీ నుంచి లేచి చిన్న వాక్ చేయాలి. ఆఫీసు అయ్యాక కనీసం ఒక అరగంటైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయండి.