నియంత్రణ రేఖకు 100 మీటర్ల దూరంలో ఇద్దరు తీవ్రవాదుల హతం.. పాక్ పాత్ర ఉంది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 10:35 AM GMT
నియంత్రణ రేఖకు 100 మీటర్ల దూరంలో ఇద్దరు తీవ్రవాదుల హతం.. పాక్ పాత్ర ఉంది..!

పాకిస్థాన్ నుండి భారత్ లోకి చొచ్చుకొస్తున్న ఇద్దరు తీవ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు తీవ్రవాదులు నియంత్రణ రేఖను దాటుకుని 100 మీటర్ల దూరం భారత భూభాగంలోకి రాగా వారిని భారత సైన్యం మట్టుబెట్టిందని సీనియర్ ఆర్మీ ఆఫీసర్ తెలిపారు. తీవ్రవాదులను పాకిస్థాన్ భారత్ లోకి పంపిస్తోంది అన్నదానికి ఇంతకు మించిన సాక్ష్యం లేదని తెలిపింది.

ఆర్టికల్ 370ని రద్దు చేసి సంవత్సరం కావస్తుండడంతో జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు హింసాత్మక కార్యక్రమాలను చేపట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. చనిపోయిన ఇద్దరు తీవ్రవాదుల్లో ఒకరు 23 సంవత్సరాల ఇద్రీస్ అహ్మద్ భట్ గా గుర్తించారు. కుప్వారా లోని హంద్వారా ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన వారని భావిస్తూ ఉన్నారు.

తీవ్రవాదుల దగ్గర ఏకే 47 రైఫిల్స్, వందల సంఖ్యలో బుల్లెట్లు, ఒక పిస్టల్, పాకిస్థాన్ ఫ్యాక్టరీ లో తయారైన ఆస్ట్రేలియా టెక్నాలజీకి చెందిన నాలుగు గ్రెనేడ్లు కూడా లభించాయి. తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వం కొమ్ము కాస్తోందనడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు ఇంకా కావాలా అని జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

2001 లో జైష్- ఏ- మొహమ్మద్ తీవ్రవాదులు భారత పార్లమెంట్ పై దాడి చేసినప్పుడు కూడా ఇలాంటి గ్రెనేడ్లనే వాడారని అధికారులు తెలిపారు. 480 గ్రాముల యాంటీ పర్సనల్ గ్రెనేడ్ లో 95 గ్రాముల PETN తో పాటూ 5000 స్టీల్ బాల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. 20 మీటర్ల విస్తీర్ణంలో మొత్తం నాశనం చేసే కెపాసిటీ ఈ గ్రెనేడ్స్ కు కలదు.

పాకిస్థానీ పోస్ట్ దగ్గర నుండి ఇద్దరు తీవ్రవాదులు వస్తుండడాన్ని భారత జవానులు గుర్తించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న ఫెన్స్ ను వారు తొలగించి వారు భారత్ లోకి చొచ్చుకుని వస్తూ ఉండగా భారత జవాన్లు వారిని తుదముట్టించారు. వారి దగ్గర ఉన్న పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాదుల వెంట ఉండి భారత్ లోకి వారిని పంపించడానికి పన్నాగాలు పన్నుతోందని భారత్ కు సమాచారం అందడంతో పెద్ద ఎత్తున నిఘా ఉంచింది భారత ప్రభుత్వం. ఇలాంటి సమయంలో ఇద్దరు తీవ్రవాదులు సరిహద్దు రేఖ వద్ద దొరికిపోయారు.

ఈ మధ్య కాలంలో చైనా తయారు చేసిన పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ లు భారత సరిహద్దుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. పాకిస్థాన్ నుండి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు కూడా దొరికిపోతూ ఉన్నాయి. దీంతో భారత్ లో మరోసారి దాడికి పాల్గొనాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ మధ్యనే పుల్వామా ఘటన తరహా దాడిని భారత సైన్యం నిర్వీర్యం చేయడంతో భారత సైన్యం హై అలర్ట్ అయింది. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మాత్రం తీవ్రవాదులకు వత్తాసు పలుకుతూనే ఉంది. భారత ప్రభుత్వం కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను తీసేసి వచ్చే ఆగస్టు నెలకు సంవత్సరం కావస్తుండడంతో అందుకు నిరసనగా తీవ్రవాదులు పెద్ద ఎత్తున కాశ్మీర్ వ్యాలీలో విధ్వంసం సృష్టించాలని భావిస్తూ ఉన్నారు. వాటిని భారత సైన్యం, పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు.

Next Story