తెలంగాణ‌కు మ‌రోమారు మిడతల దండు ముప్పు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 6:58 AM GMT
తెలంగాణ‌కు మ‌రోమారు మిడతల దండు ముప్పు

తెలంగాణ‌కు మ‌రోమారు మిడతల దండు నుండి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

మే నెలలో దేశంలో ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వ‌ర‌కూ వచ్చాయి. తెలంగాణలో ప్ర‌వేశించ‌లేదు. అయితే తాజాగా మిడతల దండు తెలంగాణ స‌రిహ‌ద్దుల‌కు సమీపంగా వ‌చ్చాయి. తెలంగాణ‌కు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామంలో ప్రస్తుతం మిడతల దండు ఉంది.

వాటి ప్రయాణం దక్షిణం వైపు సాగితే.. అతి తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే.. తెలంగాణకు ముప్పు పొంచి వున్న నేఫ‌థ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవ‌కాశం ఉన్నందున ఆ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, భాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.

అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Next Story