Fact Check : కర్ణాటక పోలీసు జీసస్ పటాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు పెట్టి పూజలు చేయమన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 10:22 AM GMT
Fact Check : కర్ణాటక పోలీసు జీసస్ పటాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు పెట్టి పూజలు చేయమన్నారా..?

హనుమంతుడి విగ్రహం ముందు జీసస్ చిత్ర పటాన్ని ఉంచి పూజలు చేస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ పూజకు ఓ మహిళా పోలీసు ఆఫీసర్ హాజరయ్యారు.

“SP of Chamarajnar district Divya Sara Thomas has visited #Anjaneya Temple in Kollegala. SP has reportedly put pressure on the priest to place the photo of #Jesus inside the sanctum Santorum of Temple and asked for pooja to be offered. @novoversion @ShefVaidya. (sic)” అంటూ ట్వీట్ చేశారు.



కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా ఎస్పీ దివ్య శ్రీ థామస్ కొల్లేగాలలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆమె ఆలయ పూజారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి.. జీసస్ ఫోటోను ముందు ఉంచింది. జీసస్ ఫోటో ముందు పూజలు చేయమని కోరింది అంటూ పోస్టులో చెప్పుకొచ్చారు.

@KapilMishra_IND, @ShefVaidya అనే వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతాలు కూడా ఈ పోస్టును రీట్వీట్ చేశాయి.

ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టులు కనిపించాయి.

నిజ నిర్ధారణ:

ఎస్పీ దివ్య సారా థామస్ ఆలయ పూజారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి జీసస్ ఫోటోకు పూజలు చేయమని కోరారన్నది 'పచ్చి అబద్ధం'

కన్నడ వార్తా పత్రిక ప్రజావాణి ఆగష్టు 11, 2020న ఈ ఘటనపై కథనాన్ని ప్రచురించింది. 'భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజను, హోమ హవనాన్ని వీరాంజనేయ ఆలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ) దివ్య సారా థామస్ కూడా అక్కడకు వచ్చారు. జిల్లాలో లాక్ డౌన్ అమలును ఆమె పరిశీలించారు. ప్రముఖ జ్యోతిష్యుడు, పూజారి అయిన రాఘవన్ ఆమెను ఆలయానికి ఆహ్వానించారు. ఎస్పీ క్రిస్టియన్ కావడంతో ఆయన జీసస్ ఫోటోను ఉంచి పూజను నిర్వహించారు. పూజ అనంతరం రాఘవన్ ఆ ఫోటోను దివ్యకు ఇచ్చారు'.

కర్ణాటక న్యూస్ ఛానల్స్ లో ఈ వార్త గురించి వచ్చింది. సువర్ణ ఛానల్ కూడా ఆయనతో చేసిన ఇంటర్వ్యూను యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. తాను చేసిన పనులకు ఆలయ పూజారి క్షమాపణలు కూడా చెప్పారు. ఏ వార్తా కథనాల్లో కూడా ఆలయ పూజారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి జీసస్ ఫోటోను పెట్టించారని చెప్పలేదు.

మంచిని పెంచడానికి మాత్రమే తాను జీసస్ ఫోటోను హనుమంతుడి విగ్రహం ముందు పెట్టానని పూజారి రాఘవన్ తెలిపారు. ఆ ఫోటోను పెట్టడం వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని.. హిందువుల మనోభావాలను దెబ్బ తీసి ఉంటే తనను క్షమించాలని ఆయన కోరారు.

కొందరు మాత్రం కావాలనే రెచ్చగొట్టేలా ఈ కథనాలకు మెలిక పెడుతూ ఉన్నారు.

కర్ణాటక ఎస్పీ హనుమంతుడి విగ్రహం ముందు జీసస్ చిత్రపటాన్ని పెట్టించి పూజలు చేయించారన్నది 'అబద్ధం'

Next Story