ఆ విద్యార్థి నేతను ఉరి తీయడం ఖాయమంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Sep 2020 9:43 AM GMT
ఆ విద్యార్థి నేతను ఉరి తీయడం ఖాయమంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో పోలీసులు అరెస్టు చేసిన జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ ఉరి శిక్ష ఖాయ‌మంటూ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పోలీసులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.



కపిల్ మిశ్రా వీడియోలో మాట్లాడిన దాని ప్ర‌కారం.. ఫిబ్రవరి 2020లో ఢిల్లీలో జరిగిన హింస.. ముంబై 26/11ఉగ్రవాద దాడికి సమానమని పేర్కొన్నారు. ఇది ఢిల్లీలో ఓ పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని.. హింసాత్మక అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్ తదితరులు యత్నించారనీ, దుకాణాలను తగుల బెట్టి, ప్రజలను మట్టుపెట్టేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. ఇలాంటి ఉగ్రవాదులను జీవిత ఖైదు చేసి, ఉరితీస్తారన్నారు.

ఢిల్లీ పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం కపిల్ మిశ్రా వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇదిలావుంటే.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనోద్యమం సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story