కరోనాతో చనిపోతే.. ప్రభుత్వ ఉద్యోగం
By తోట వంశీ కుమార్ Published on 16 July 2020 11:45 AM GMTదేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి భారీన పడి 24 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడిలో విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ సైతం ఈ మహమ్మారి బారీన పడుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. దీంతో ఉద్యోగుల్లో భరోసా కల్పిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆమె తెలిపారు. దీదీ ఇచ్చిన హామీతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా వైరస్ బారిన పడి మరణిస్తే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తామని దీదీ తెలిపారు. కాగా ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 268 మంది పోలీసులు,30 మంది డాక్టర్లకు 43 మంది వైద్య సిబ్బంది, 62 మంది ఇతర అధికారులు మహమ్మారి వైరస్తో బాధపడుతున్నారు. అక్కడ 34,427 మందికి వ్యాధి సోకగా..20,680 మంది కోలుకున్నారు. 1000 మంది ప్రాణాలు కోల్పోయారు.