భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 32,695 కేసులు.. 606 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2020 6:16 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 32,695 కేసులు.. 606 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదిలక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 32,695 కేసులు నమోదు కాగా.. 606 మంది మృత్యువాత పడ్డారు. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే.

వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,68,876కి చేరగా.. 24,915 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 6,12,815 మంది కోలుకోగా.. 3,31,146 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,27,39,490 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,26,826 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 2,75,640 కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Next Story