ఆదివారం జనసేన లాంగ్ మార్చ్ కాని..షాక్ ల మీద షాక్ లు..!
By Medi Samrat Published on 2 Nov 2019 12:50 PM ISTముఖ్యాంశాలు
- లాంగ్ మార్చ్ కు ముందు జనసేనకు షాక్ లు
- బీజేపీని పిలిచినందుకు అలిగి రాలేమన్న సీపీఎం,సీపీఐ
- లాంగ్ మార్చ్ కు ముందు రాజీనామా చేసిన బాలరాజు
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ విశాఖపట్నంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఇసుక కొరత వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని హైలెట్ చేయడం కోసం ఆదివారం లాంగ్ మార్చ్ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.
అయితే.. ఈ లాంగ్ మార్చ్ కు వామపక్షాలు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాయి. జనసేనాని పవన్ లాంగ్ మార్చ్ కు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము ప్రత్యక్షంగా పాల్గొనలేమని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు సంయుక్తంగా పవన్ కళ్యాణ్ కు ఓ లేఖను రాశాయి.
కీలక నేత బాలరాజు రాజీనామా..!
ఆదివారం మార్చ్ జరగనుండగా విశాఖలో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.జనసేన కీలకనేత పసుపులేటి బాలరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు పంపారు. ఎన్నికలకు ముందు పవన్ సమక్షంలో బాల రాజు పార్టీలో చేరారు. పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత జనసేనకు చెందిన పలువురు నేతలు రాజీనామాలు చేసి వైసీపీలో చేరుతున్నారు.
రాజీనామా అనంతరం బాలరాజు ఏ పార్టీలో చేరతారనేది స్పష్టం కాలేదు. వైసీపీలో చేరే అవకాశముందని ఆయన అనుచరులు చెబుతున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించాలని పసుపులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్: మంత్రి అనిల్
అమరావతి: టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన వ్యవహరిస్తోందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పవన్ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్ అని మంత్రి అనిల్ మండిపడ్డారు. రాష్ట్రంలో నీటితో నిండి ఉన్న నదులు పవన్కి కనిపించడంలేదా?.. ఇసుక పేరుతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు, పవన్పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. గతంలో ఐదేళ్లు ఇసుక మాఫియా చేసిన దారుణాలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్ మార్చ్ వైజాగ్లో కాకుండా కృష్ణా, గోదావరి నదుల ఒడ్డున చేయాలన్నారు. రాజకీయ ఉనికి కోసమే పవన్, చంద్రబాబు ఇసుక ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వరదలు తగ్గుముఖం పడుతున్నాయి.. వారం రోజుల్లో రాష్ట్రంలో ఇసుక కొరత తీరబోతుందన్నారు. పవన్కు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయ్యాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. సమస్య ఉంటే సీఎం వద్దకు వచ్చి చెప్పొచ్చుగా.. అలా ఎందుకు చెయ్యడం లేదన్నారు. సీఎం జగన్ని కలిసి ఎదురుగా మాట్లాడే అంత ధైర్యం పవన్, చంద్రబాబుకు లేవని మంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.