నేడు 'జగనన్న విద్యాదీవెన' పథకం ప్రారంభం
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 April 2020 8:17 AM ISTనేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హమీని నెరవేర్చే విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. దేశచరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం అయినటువంటి.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని నేడు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు.
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో.. ఫీజు రీఇంబర్స్మెంట్ కింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల చేయనున్నారు. అలాగే.. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లించనున్నారు. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు లబ్ది చేకూరనుంది.
కాగా.. అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులు.. బకాయిలు లేకుండా ఒకే ఆర్దిక సంవత్సరంలో చెల్లించనున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12,000 కోట్లు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని నేడు ప్రారంభించనుంది.