'బీఆర్ఎస్‌ని ఓడించేది మేమే'.. న్యూస్ మీటర్‌తో ఈటల రాజేందర్

బీజేపీ కార్యకర్తలను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2023 6:07 AM GMT
BJP, Etala Rajender,  BRS, Telangana

'బీఆర్ఎస్ ఓడించేది మేమే'.. న్యూస్ మీటర్‌తో ఈటల రాజేందర్   

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్న హుజూరాబాద్‌ శాసన సభ సభ్యుడు ఈటెల రాజేందర్‌ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన భారత రాష్ట్ర సమితితో హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓ వైపు ఆయన తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి పోరాడడం లేదనే వార్తలు వస్తూ ఉండగా.. మరో వైపు తన నియోజకవర్గంలో తన అనుచరులను, బీజేపీ కార్యకర్తలను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కీలక భూమికను పోషించనున్నారు. ఆయనతో న్యూస్ మీటర్ కీలక విషయాలను చర్చించింది.

ప్రశ్న: మీ ఇటీవలి ఢిల్లీ పర్యటన చాలా పుకార్లకు కారణమైంది. మీరు ఢిల్లీ వెళ్లారా లేక బీజేపీ కేంద్ర నాయకత్వం మిమ్మల్ని పిలిపించిందా?

సమాధానం: బీజేపీ వ్యవస్థీకృత పార్టీ. కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి రావాలని కోరారు. వారిని కలవడానికి నేను సొంతంగా వెళ్ళలేను. వాళ్ళు రమ్మని పిలిచారు కాబట్టే నేను వెళ్లి కలిశాను.

ప్రశ్న: మీ చర్చల వెనుక ఎజెండా ఏమిటి?

సమాధానం: తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయగలమో కేంద్ర నాయకత్వం అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పార్టీకి ఇదే చెప్పాను. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు.. వ్యూహాలకు సంబంధించి నేను నా ఇన్‌పుట్ ఇచ్చాను.

ప్రశ్న: బీజేపీలో మీరు సంతోషంగా లేరని పుకార్లు వచ్చాయి?

సమాధానం: నిత్యం ఎన్నో పుకార్లు వస్తూనే ఉంటాయి. నేను బీజేపీతోనే ఉన్నాను, కేసీఆర్‌పై పోరాటం కొనసాగిస్తాను. అన్ని రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, వీటిని అంతర్గతంగా చర్చించి సర్దుకుంటున్నారు. నేను నా వైఖరిని తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌తో ప్రజలు విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

ప్రశ్న: కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత బీఆర్‌ఎస్‌పై మెతకగా వ్యవహరిస్తోందన్న పుకార్లు రావడంతో బీజేపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. మీ స్పందన ఏమిటి?

సమాధానం: అలాంటిదేమీ లేదు. బీఆర్‌ఎస్‌పై బీజేపీ నోరు మెదపడం లేదన్నది కరెక్ట్ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నామని బీజేపీ ముందు నుండి చాలా స్పష్టంగా చెబుతోంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి పటిష్ట చర్యలు తీసుకుంటాం. బీజేపీ ఏ ఒక్క వ్య‌క్తి ప్ర‌యోజనం కోసం పనిచేయదు. పార్టీ కోసం వ్యూహం రచిస్తున్నారు. దీని ప్రకారం, ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం.

ప్రశ్న: హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది? మీ మద్దతుదారులతో మీ భార్య జమున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏమి జరిగింది?

సమాధానం: హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పోలీసుల సాయం తీసుకుని నా దగ్గర ఉన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సర్పంచ్, పలువురు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. మహిళలను కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు చేసిన వారిని వేధిస్తున్నారు. నా నియోజకవర్గంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ విషయం ప్రజలకు తెలియజేయాలని నా భార్య జమున విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేశారు.

ప్రశ్న: సికింద్రాబాద్, కొంపల్లి.. మీ నియోజకవర్గాలలో స్థానిక బీజేపీ కార్యకర్తలు మీకు ఉండగా.. బీజేపీ నుండి సీనియర్ నాయకులు ఎవరూ కనిపించలేదు. ఎందుకు?

సమాధానం: నాతో ఉన్న కార్యకర్తలు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ గ్రౌండ్ వర్కర్లు. వారంతా ఇక్కడే ఉన్నారు. తప్పుడు కేసుల వల్ల నేను, నా పార్టీ కార్యకర్తలు భయపడబోమని బీఆర్ఎస్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నేతలు పోలీసుల అండతో నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మమ్మల్ని అణచివేయడానికి రాష్ట్ర పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు తగిన సమాధానం చెప్పబోతున్నాం. ఇకపై వారు నా నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వకుండా చేస్తాం.

Next Story