ఇరాన్లో అశాంతి పెరిగిపోయి గత రెండు వారాలలో కనీసం 2,403 మంది మరణించిన నేపథ్యంలో, నిరసనకారులను ఉరితీస్తే "చాలా కఠినమైన చర్యలు" తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను హెచ్చరించారు. ఈ హెచ్చరికకు ఇరాన్ నాయకత్వం నుండి తీవ్ర స్పందన వచ్చింది. ఆ దేశ జాతీయ భద్రతా చీఫ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజల ప్రధాన హంతకులని ఆరోపించారు.
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల ఎర్ఫాన్ సుల్తానీ అనే యువకుడికి విధించిన మరణశిక్షను బుధవారం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సుల్తానీని ఉరితీస్తే ఇరాన్ అత్యంత కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టెహ్రాన్ సమీపంలోని కరాజ్లో జనవరి 8న ఎర్ఫాన్ సుల్తానీని అరెస్ట్ చేశారు. ఎలాంటి సరైన విచారణ జరపకుండా, కనీసం న్యాయవాదిని కూడా నియమించుకునే అవకాశం ఇవ్వకుండానే అతడికి మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.