బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చదని, దాన్ని ప్రధాని మోదీకి వదిలేస్తున్నానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్, మోదీ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బంగ్లాదేశ్ విషయంలో మీ పాత్ర ఏంటని రిపోర్టర్స్ అడగ్గా.. చాలా కాలం నుంచి బంగ్లా వ్యవహారాలను మోదీ చూస్తున్నారు. దాన్ని ఆయనకి అప్పగిస్తున్నా.. ఆ దేశంతో ఎన్నో ఏళ్లుగా ఇండియాకు సంబంధం ఉందని అని తెలిపారు. మరోవైపు ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించలేదు.
ముంబై ఉగ్రదాడి 2008 కుట్ర దారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్ను భారత్కు అప్పగించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో హుస్సేన్ ఒకడని, అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఇందుకు ఒప్పుకున్నందుకు ట్రంప్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు కలిసి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పని చేస్తాయని పేర్కొన్నారు.
అటు మానవ అక్రమ రవాణా వ్యవస్థను అంతం చేయడానికి భారత్, యూఎస్ కలిసి పని చేయాలని పీఎం మోదీ అన్నారు. అక్రమ వలసదారుల అంశంపై యూఎస్లో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారికి అక్కడ ఉండే హక్కు లేదని అన్నారు. భారతీయులెవరైనా యూఎస్లో అక్రమంగా నివసిస్తుంటే వారిని తిరిగి తీసుకురావడానికి తాము సిద్దమే అని చెప్పారు. చాలా మంది సాధారణ కుటుంబాలకు చెందిన వారని, ఏజెంట్స్ మాటలు నమ్మి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు.