థాయ్లాండ్లోని ఆ ప్రాంతాలకు భారతీయులు వెళ్లొద్దు
థాయ్లాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూ ఉంది.
By Medi Samrat
థాయ్లాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూ ఉంది. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం కీలక సూచనలు జారీ చేశారు. భారత పౌరులు థాయ్లోని ఏడు ప్రావిన్స్ల వైపు ప్రయాణం చేయొద్దని థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం సూచింది. మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని, ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని ప్రావిన్స్లకు వెళ్ళకపోవడం మంచిదని సూచించారు.
మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. థాయ్ భూభాగంపై కంబోడియా రాకెట్లు, ఆర్టిలరీని ప్రయోగించగా, థాయ్లాండ్ ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఉపయోగించి సరిహద్దు ఆవల సైనిక లక్ష్యాలపై దాడులకు దిగింది. ఐదుగురు థాయ్ సైనికులు ల్యాండ్మైన్ పేలుడులో గాయపడటంతో కంబోడియా రాయబారిని థాయ్లాండ్ బహిష్కరించింది. 800 కిలోమీటర్ల సరిహద్దుపై ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా వివాదం ఉంది.