27 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో కూడా ఆ సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు..!
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానంలో క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 241 మంది మరణించారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో విమానంలో 11A సీటులో కూర్చున్న వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
27 సంవత్సరాల క్రితం థాయ్లాండ్లో కూడా ఇలాంటి విమాన ప్రమాదం జరిగింది. అందులో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కూడా 11A సీటులో కూర్చున్నాడు. ది టెలిగ్రాఫ్ వార్తపత్రిక ప్రకారం.. ఈ వ్యక్తి థాయ్ నటుడు, గాయకుడు అయిన జేమ్స్ రుయాంగ్సాక్ లాయ్చుసాక్.
Loychusak 1998లో థాయ్ ఎయిర్వేస్ విమానం TG261లో ప్రయాణించాడు. ఈ విమానం బ్యాంకాక్ నుండి బయలుదేరి దక్షిణ థాయ్లాండ్లోని సూరత్ థాని నగరంలో ల్యాండ్ కానుంది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానం గాలిలో ఆగి, కుప్పకూలింది.
ఈ విమానంలో 146 మంది ఉండగా.. అందులో 101 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో లోయ్చుసాక్ కూడా ఉన్నాడు. లాయిచుసాక్ విమానంలోని 11A సీటులో కూర్చున్నాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కథనం మీడియా హెడ్లైన్స్గా మారడంతో.. దాని గురించి లాయిచూసాక్కు తెలిసింది. దీంతో తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ అప్పటి ప్రమాదంపై సమాచారం ఇచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బ్రిటీష్-భారత పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ కుమార్ రమేష్ కూడా విమానంలోని 11A సీటులో కూర్చున్నాడు. లోయ్చూసక్ వలె.. అతను కూడా ప్రమాదం తర్వాత తనంతట తానుగా ప్రమాద స్థలం నుండి వెళ్లిపోయాడు.
ఇది కేవలం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. రెండు ప్రమాదాల పరిస్థితులలో చాలా వ్యత్యాసం ఉంది. థాయ్ ఎయిర్వేస్ విమానం ఎయిర్బస్ A310 కాగా.. ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్. ఈ రెండింటి మధ్య 11A సీట్ల స్థానం, డిజైన్, లేఅవుట్లో చాలా తేడా ఉంది. థాయ్ ఎయిర్వేస్ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో లాయిచుసాక్ కూడా ఒకరు. కాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.