పేరుమోసిన టెర్రరిస్ట్ జైలులో ఉంటూ తండ్రి అయ్యాడు.. పాక్ ద్వంద్వ వైఖరిపై విరుచుకుపడ్డ ఒవైసీ
'ఆపరేషన్ సింధూర్' విజయంతో ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది.
By Medi Samrat
'ఆపరేషన్ సింధూర్' విజయంతో ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడుగురు అఖిలపక్ష ప్రతినిధులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ తీరును బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పాకిస్థాన్ ద్వంద్వ స్వభావాన్ని ఒవైసీ బట్టబయలు చేస్తూ.. ఓ పేరుమోసిన ఉగ్రవాది పాకిస్థాన్ జైలులో ఉంటూ తండ్రి అయ్యాడని అన్నారు. ఒవైసీ ప్రస్తుతం అల్జీరియాలో ఉన్న అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఉన్నారు. శనివారం భారత సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ అనే ఉగ్రవాది ఉన్నాడు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదిని జైలు నుంచి బయటకు రావడానికి ప్రపంచంలోని ఏ దేశం అనుమతించదు.. కానీ అతడు జైలులో కూర్చొని ఒక కొడుకుకు తండ్రి అయ్యాడని పేర్కొన్నారు.
పాకిస్తాన్ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) గ్రే లిస్ట్లో చేర్చాలని ఒవైసీ పట్టుబట్టారు. పాకిస్థాన్ను మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లో ఉంచితే భారత్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పడతాయన్నారు.
FATF అనేది ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించకుండా నిరోధించడానికి విధానాలను అభివృద్ధి చేసే, ప్రోత్సహించే ఒక స్వతంత్ర అంతర్-ప్రభుత్వ సంస్థ.
ఉగ్రవాదం ఇకపై దక్షిణాసియాకు సంబంధించిన అంశం కాదని ఏఐఎంఐఎం చీఫ్ అన్నారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. పరిస్థితి ఇలాగే ఉంటే ఏమవుతుంది.? ఈ విధ్వంసం దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని మీరు అనుకుంటున్నారా.? అని ప్రశ్నించారు.
అల్జీరియా మీడియా, థింక్ ట్యాంక్ సభ్యులు, భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ.. పాకిస్తాన్లోని ఉగ్రవాద గ్రూపులు డేష్, అల్-ఖైదా మధ్య సైద్ధాంతిక వ్యత్యాసం లేదని అన్నారు. తక్ఫిరిజానికి పాకిస్థాన్ కేంద్రంగా ఉంది. తమకు మతపరమైన ఆమోదం ఉందని వారు నమ్ముతారు, ఇది పూర్తిగా తప్పు. ఇస్లాం ఏ వ్యక్తిని చంపడాన్ని అనుమతించదు.. దురదృష్టవశాత్తు ఇది వారి భావజాలం అన్నారు.