అమెరికాలో తెలుగు విద్యార్థి సజీవదహనం

Telugu student burnt alive in America. అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి గుర్రపు శైలేశ్ ప్రాణాలు కోల్పోయాడు.

By Medi Samrat  Published on  4 Jun 2023 10:47 AM IST
అమెరికాలో తెలుగు విద్యార్థి సజీవదహనం

అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి గుర్రపు శైలేశ్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి వయసు 25 సంవత్సరాలు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన శైలేశ్ పైచదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ బయోమెడికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శనివారం శైలేశ్ కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొంది. శైలేశ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యాడు. శైలేశ్ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శైలేశ్ తండ్రి గతంలో గల్ఫ్‌కు వెళ్లివచ్చారు. తల్లి గృహిణి. శైలేశ్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. గుర్రపు శైలేష్ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు గతేడాది సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ న్యూజెర్సీలో ఉంటూ తన స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. శైలేశ్ మృతదేహాన్ని భారత్ కు తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.


Next Story