ఆత్మాహుతి దాడి.. 23 మంది పోలీసులు మృతి

పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు

By Medi Samrat  Published on  12 Dec 2023 3:30 PM GMT
ఆత్మాహుతి దాడి.. 23 మంది పోలీసులు మృతి

పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు పేలుడు పదార్దాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి, అక్కడ ఆ వాహనాన్ని పేల్చేశారు. అనంతరం, పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. ఈ ఆత్మాహుతి దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాహనాన్ని పేల్చిన అనంతరం పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్ కౌంటర్ కొన్ని గంటల పాటు కొనసాగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

తెహ్రీక్-జిహాద్ పాకిస్తాన్ సంస్థ ఈ దాడికి పాల్పడింది. పాకిస్తాన్ తాలిబాన్‌తో అనుబంధంగా ఉంది. దాడి ఉదయం 2:30 గంటలకు ప్రారంభమైందని, ఒక యోధుడి బలిదానంతో దాడి చేయగలిగామని తీవ్రవాద సంస్థ తెలిపింది. కొందరు ప్రాణాలతో బయటపడి తుపాకీలతో దూసుకెళ్లారని తెలిపారు. ఈ గ్రూప్ ఫిబ్రవరి 2023లో ఏర్పడింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణం అఫ్గానిస్తాన్ కు సమీపంలో ఉండడం తీవ్రవాదులకు కలిసి వస్తోంది. గతంలో ఇక్కడ ఉగ్రవాద సంస్థ ‘‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP)’’ బలంగా ఉండేది. ఇటీవల ఇక్కడ ‘‘తెహ్రీక్ ఇ జహీద్ పాకిస్తాన్" పేరుతో మరో ఉగ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ రోజు పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది తామేనని ఈ టీజేపీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

Next Story