కొన్నేళ్లుగా భారత్ లోనే బ్రతుకుతున్న శ్రీలంక డాన్.. నిజం ఎలా బయట పడిందంటే..!

Sri Lanka's Don living in India after changing name, exposed in this way. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి

By Medi Samrat  Published on  17 Nov 2021 2:00 PM GMT
కొన్నేళ్లుగా భారత్ లోనే బ్రతుకుతున్న శ్రీలంక డాన్.. నిజం ఎలా బయట పడిందంటే..!

తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అతని డీఎన్‌ఏ పరీక్ష రిపోర్టు బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు మోస్ట్ వాంటెడ్ డాన్ అట..! అతను శ్రీలంక అండర్ వరల్డ్ డాన్.. తన గుర్తింపును దాచిపెట్టి చాలా కాలంగా భారతదేశంలో నివసిస్తున్నాడనే విషయం తెలిసి ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది.

కోయంబత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంక అండర్ వరల్డ్ డాన్ అంగోడ లోక్కా భారతదేశంలో తన గుర్తింపును దాచి ప్రదీప్ సింగ్ పేరుతో నివసిస్తున్నాడు. అతను జూలై 3, 2020న గుండెపోటుతో మరణించాడు. పోస్ట్‌మార్టం తర్వాత అతని మృతదేహాన్ని మధురైలో దహనం చేశారు. అయితే పోలీసులు ప్రదీప్‌ ఎవరనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో శ్రీలంక ప్రభుత్వం సహాయంతో అంగోడ లోక్కా తల్లి డీఎన్‌ఏ నుంచి నమూనా తీసుకుని చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక రావడంతో మృతుడు ప్రదీప్ కాదని, అండర్ వరల్డ్ డాన్ అంగోడ లోక్కా అని తేలింది. సిఐడి సిటీ కోర్టును ఆశ్రయించింది మరియు అంగోడా డిఎన్‌ఎ అతని తల్లి నుండి సరిపోలినందున అతనిపై నమోదు చేయబడిన అన్ని కేసులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంగోడ లోక్కా రెండేళ్లుగా కోయంబత్తూరులో తలదాచుకుంటున్నాడు. అంతకు ముందు కూడా పలు ప్రాంతాల్లో అతడు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అంగోడ లోక్కా గుర్తింపును మార్చి నకిలీ కాగితాలు తయారు చేసేందుకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముగ్గురూ మధురైలో అంగోడ లోక్కాను దహనం చేశారని.. వీరు భారతదేశంలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన తమిళులని తెలుస్తోంది.


Next Story