భారత్తో చర్చల కోసం ట్రంప్ సాయం కోరిన పాక్ ప్రధాని
పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్ ఎన్నో మార్లు సాయం కోసం ప్రపంచాన్ని అర్ధించింది
By Medi Samrat
పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్ ఎన్నో మార్లు సాయం కోసం ప్రపంచాన్ని అర్ధించింది. కొన్నిసార్లు డబ్బు కోసం, కొన్నిసార్లు వనరుల కోసం, కొన్నిసార్లు ఆహారం, నీటి కోసం.. ఇలా పాకిస్తాన్ తన చేతిని ప్రపంచం ముందు చాచడానికి వెనుకాడదు.
తాజాగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మరోసారి అమెరికా సాయం కోసం చేయి చాచారు. భారత్తో చర్చలు జరపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు తమతో చర్చలుండవని పాకిస్థాన్కు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది.
ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు షాబాజ్ షరీఫ్ వచ్చారు. ఈ సందర్భంగా భారత్తో ఉద్రిక్తతను తగ్గించినందుకు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. భారత్తో చర్చలను సులభతరం చేయాలని కూడా షరీఫ్ ట్రంప్ను కోరారు. అయితే.. చర్చల్లో మూడో పక్షం ప్రమేయం ఉండదని భారత్ స్పష్టమైన అభిప్రాయంతో ఉంది.
పాకిస్తాన్ అనేక సార్లు కాల్పుల విరమణ క్రెడిట్ను అమెరికాకు ఇచ్చింది. అయితే దీన్ని భారత్ స్పష్టంగా ఖండించింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా భారత్-పాకిస్థాన్ మధ్య దాదాపు 10 వేర్వేరు సందర్భాలలో కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్ సహకరించారని, ఆ ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు.
అయితే.. పహల్గామ్ దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. నీటి కోసం అలమటిస్తున్న పాకిస్థాన్ భారత్తో చర్చలు జరిపి ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు అమెరికాను మధ్యవర్తిత్వం చేయమంటుంది.
అయితే.. అమెరికా చేరుకున్న భారత ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ మాట్లాడుతూ.. తలపై తుపాకీ గురిపెట్టినా చర్చలుండవనే భారత్ వైఖరి అమెరికాకు స్పష్టంగా అర్థమైందని అన్నారు. మీ పొరుగువారు తన కుక్కను మీ పిల్లలను కాటు వేశాక.. మాట్లాడుకుందాం అని అన్నట్లయితే.. దానిని కుక్కల గూటిలో బంధించే వరకూ నువ్వు అతడితో మాట్లాడవు కదా అని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశంగా పిలుచుకుంటుంది. దీనిపై థరూర్ మాట్లాడుతూ.. ఇది ఎవరి తప్పు? మీరు మీ పెరట్లో పాములను ఉంచుకోలేరు.. అవి మీ పొరుగువారిని మాత్రమే కాటు వేయాలని ఆశించకూడదు. పాకిస్థాన్ తనను తాను నిర్దోషి అని అనుకోవడం మానేయాలన్నారు.