ఐరోపా దేశమైన సెర్బియా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర రభస సృష్టించారు. సెర్బియా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు అనేక స్మోక్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ షెల్లను విసిరారు. విశ్వవిద్యాలయ విద్యకు నిధులను పెంచే చట్టంపై ఎంపీలు ఓటు వేయవలసి ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు సెషన్ చట్టవిరుద్ధమని.. ప్రధాన మంత్రి మిలోస్ వుసెవిక్.. ఆయన ప్రభుత్వం ముందుగా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఈ విషయం పార్లమెంటులో తీవ్రరూపం దాల్చడంతో ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సభలో జరిగిన ఈ కోలాహలం టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. పార్లమెంట్ అంతటా నలుపు, గులాబీ రంగు పొగలు వ్యాపించడాన్ని వీడియోలో చూడవచ్చు.
ఇదిలావుంటే.. నవంబర్లో సెర్బియా ఉత్తర ప్రాంతంలో కాంక్రీట్ పందిరి కూలి 15 మంది మృతి చెందడంతో అధికారులు భారీ నిరసనలను ఎదుర్కొవడంతో.. మిలోస్ వుసెవిక్ జనవరిలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.