ఐరాసలో చైనాకు గట్టి కౌంటర్ వేసిన భారత్
Rajkumar Ranjan Singh Strong Counter to China. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు దేశాలకు చైనా రుణాలు అందిస్తూ..
By M.S.R Published on 10 Nov 2021 10:20 AM GMT![ఐరాసలో చైనాకు గట్టి కౌంటర్ వేసిన భారత్ ఐరాసలో చైనాకు గట్టి కౌంటర్ వేసిన భారత్](https://telugu.newsmeter.in/h-upload/2021/11/10/308061-rajkumar-ranjan-singh-strong-counter-to-china.webp)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు దేశాలకు చైనా రుణాలు అందిస్తూ.. తమకు కావాల్సిన పనులను చేసుకుంటూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక దేశాలు చైనా రుణభారం మోయలేకపోతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భారత్ గమనిస్తూనే ఉంది. తాజాగా ఐక్య రాజ్య సమితి(ఐరాస) లో చైనా పేరు చెప్పకుండా గట్టి కౌంటర్ ను వేసింది. ఐరాసలో అంతర్జాతీయ శాంతి భద్రతలు, మినహాయింపులు, నిర్వహణ, అసమానతలు, సంఘర్షణలు తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ చర్చలో భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయమంత్రి డాక్టర్ రాజ్కుమార్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఎల్లప్పుడు భారత్ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ సహకరిస్తామని.. ఇతర దేశాలకు సాయం పేరుతో రుణభారాన్ని మోపబోమని రంజన్ సింగ్ తెలిపారు. మానవతా దృక్పధంతోనే పేద దేశాలకు సహాయం చేస్తున్నామని, ఎప్పుడూ ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చి రుణభారాన్ని మోపబోమని అన్నారు. పొరుగున ఉన్న దేశాలకైనా, ఆఫ్రికన్ దేశాలకైనా అక్కడి డిమాండ్ మేరకే సహాయం అందిస్తామని అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ పేరుతో పెట్టుబడులు పెట్టి ఆయా దేశాలపై రుణభారాన్ని పెంచే దేశాల మాదిరిగా తాము చేయబోమని ఆయన చెప్పారు. చైనా పేరు ఎత్తకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.