రియాలిటీ షో 'తమాషా ఘర్', 2015 చిత్రం 'జలైబీ' లలో తన పాత్రలతో హృదయాలను గెలుచుకున్న పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ కన్నుమూశారు. ఆమె మరణించిన దాదాపు మూడు వారాల తర్వాత విషయం బయటకు వచ్చింది. కరాచీలోని డిఫెన్స్ ఏరియాలోని తన అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించింది.
హుమైరా అస్గర్ గత కొన్నేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. అయితే.. గత మూడు వారాలుగా ఆమె ఎవరికీ కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె ఫ్లాట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలుమార్లు తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, హుమైరా మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వివరించారు.
హుమైరాను కనుగొనడానికి కనీసం 15 నుండి 20 రోజుల ముందే ఆమె మరణించిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలుస్తుంది. జియో టీవీ నివేదించిన ప్రకారం, అధికారులు ప్రస్తుతం దీనిని సహజ మరణంగా పరిగణిస్తున్నారు.