పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే నెలలో భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసం చేసిన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలను తిరిగి నిర్మించడానికి పాకిస్తాన్ చురుకుగా పనిచేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పరిసర ప్రాంతాలలో ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ సైన్యం, దాని నిఘా సంస్థ ISI, ప్రభుత్వం గణనీయమైన నిధులు, పూర్తి మద్దతును అందిస్తున్నట్లు సమాచారం.
మే 7న, భారత దళాలు పాకిస్తాన్, పీఓకే అంతటా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-తోయిబా (ఎల్ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్లకు ఈ ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. అత్యంత ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి బహవల్పూర్లోని జెఎం ప్రధాన కార్యాలయం, దీనిని జెఎం కార్యకలాపాలకు కేంద్రంగా భావిస్తారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ISI సహకారంతో నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని దట్టమైన అడవులలో హైటెక్, చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా సంస్థలు తెలిపాయి. ఈ వ్యూహం నిఘా, వైమానిక దాడులను తప్పించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పునర్నిర్మించబడుతున్న శిబిరాలు లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఉన్నాయి. ఈ శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఫోలేజ్-పెనెట్రేటింగ్ రాడార్, ఉపగ్రహ నిఘాను ఎదుర్కోవడానికి రూపొందించిన అధునాతన సాంకేతికతలు ఉన్నాయి.