హఫీజ్ సయీద్ ముంబై దాడుల మాస్టర్ మైండ్, నిషేధిత జమాత్ –ఉద్–దవా(జుద్) చీఫ్.. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కు పాకిస్థాన్ ఎప్పటి నుండో కొమ్ము కాస్తూ ఉంది. తీవ్ర వాది అంటూ ప్రపంచం మొత్తం ముద్ర వేసినా కూడా హఫీజ్ సయీద్ చాలా మంచి వాడు అంటూ చెప్పుకొచ్చింది. భారత్ ప్రపంచ దేశాల మద్దతుతో పాక్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకుని రావడంతో అతడిని జైలులో పడేయాలని అనుకుంది.
తాజాగా హఫీజ్ సయీద్కి పాక్లోని లాహోర్లో ఉన్న యాంటీ టెర్రరిస్టు కోర్టు 15 ఏళ్ల 6నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న నాలుగు నేరాల్లో ఇప్పటికే 70 ఏళ్ళ సయీద్కి 21 ఏళ్ళ శిక్ష పడింది. సయీద్ సహా జమాత్–ఉద్–దవా ఉగ్రవాద సంస్థ ఐదుగురు నాయకులకు కోర్టు పదిహేనున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని కోర్టు అధికారులు తెలిపారు. సయీద్కి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చి ప్రోత్సహిస్తున్నారన్న ఐదు నేరాల్లో కలిపి మొత్తం 36 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. 2008లో ముంబై దాడుల మొత్తం ప్లాన్ హఫీజ్ సయీద్ దే. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది.