భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం అరేబియా సముద్రంలో కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సముద్రంలో పడిపోయారు. అందులో ఒకరి ఆచూకీ లభించగా.. మరొకరు తప్పిపోయారు. తప్పిపోయిన పైలట్ కోసం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించామని నేవీ అధికారులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయమై విచారణకు ఆదేశించామని తెలిపారు. కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు.
రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్ఎస్ హన్సా నుంచి బయల్దేరిన మిగ్-29కే విమానం నిన్న సాయంత్రం 5 గంటలకు అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఏడాది మిగ్-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి. గత ఫిబ్రవరిలో గోవా తీరంలో మిగ్-29 కే శిక్షణ విమానం ఉదయం 10.30 గంటలకు కూలిపోయింది. అయితే అందులో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.