మెక్సికోలో ఏమి జరుగుతోంది..!

Mexico’s death toll becomes the world’s third highest, surpassing India’s. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న

By Medi Samrat  Published on  30 Jan 2021 10:56 AM GMT
మెక్సికోలో ఏమి జరుగుతోంది..!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే..! ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాల్లో వేస్తూ వస్తున్నారు. తాజాగా మెక్సికో దేశం కరోనా దెబ్బకు అల్లాడుతూ ఉంది. ఆ దేశంలో భారత్‌ కంటే అధికంగా క‌రోనా‌ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. క‌రోనా వైర‌స్ విజృంభించ‌కుండా స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యంగా వ్యవహరించడం మెక్సికోలో కరోనా వైర‌స్ విజృంభ‌ణకు కారణం అయింది. ఈ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రడార్ కు కూడా క‌రోనా వైరస్ సోకిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

భార‌త్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,33,131కు చేరింది.. మృతుల సంఖ్య 1,54,147 కు పెరిగింది. మెక్సికోలో కోవిడ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా.. మరణాలు మాత్రం భార‌త్ కంటే అధికంగా ఉన్నాయి. దాదాపు 1,55,000 పైగా మ‌ర‌ణాలు నమోదయ్యాయి. మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భార‌త్ ఇంత‌కు ముందు మూడో స్థానంలో ఉండేది. ఇప్పుడు మెక్సికో ఆ మూడో స్థానానికి ఎగ‌బాకింది. క‌రోనా మరణాల విషయంలో అమెరికా తొలి స్థానంలో ఉండ‌గా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత స్థానాల్లో మెక్సికో, భార‌త్ ఉన్నాయి.

మెక్సికో అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 40 శాతం మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మెక్సికోలోని ఆసుపత్రులు 90 శాతానికి పైగా క‌రోనా‌ రోగులతో నిండిపోయాయి. మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో 70 శాతం కంటే ఎక్కువగా క‌రోనా రోగులే ఉన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఇత‌ర దేశాలు మొద‌టి నుంచి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను మెక్సికో తీసుకోక‌పోవ‌డ‌మే ఆ దేశంలో క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణమని అధికారులు చెబుతూ ఉన్నారు. లాక్‌డౌన్‌ ను సరిగా అమలు చేయకపోవడంతో భారీ జ‌నాభా ఉన్న దేశాల కంటే త‌క్కువ జ‌నాభా ఉన్న మెక్సికోలో క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్నాయి. ఆ దేశంలో మాస్కు, సామాజిక దూరం తదితర నిబంధనలను తప్పనిసరి చేయకపోవడమే మెక్సికోలో ఇప్పుడు కరోనా మరణాలు అత్యధికం అయ్యే పరిస్థితులు దాపురించాయి. రాబోయే రోజుల్లో కరోనా మరణాలు మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.


Next Story