మ‌సీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి..!

Massive Explosion Hits Kabul Mosque.బాంబు పేలుడుతో అఫ్గానిస్థాన్​ మరోమారు దద్దరిల్లింది. కాబుల్‌లోని ఖైర్ ఖానా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2022 2:37 AM GMT
మ‌సీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి..!

బాంబు పేలుడుతో అఫ్గానిస్థాన్​ మరోమారు దద్దరిల్లింది. కాబుల్‌లోని ఖైర్ ఖానా ప్రాంతంలోని మ‌సీదులో బుధ‌వారం సాయంత్రం ప్రార్థ‌న‌లు జ‌రుగుతుండ‌గా భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇమామ్ స‌హా 20 మర‌ణించారు. 40 మందికిపైగా గాయ‌ప‌డ్డారని స్థానిక మీడియా సంస్థ తెలిపింది. పేలుడు స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

"బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీలు ధ్వంసం అయ్యాయి. "అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో ఎంత మంది మ‌ర‌ణించారు అనే విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సంస్థా కూడా బాధ్య‌త వ‌హించ‌లేదు. ఇస్లామిక్ స్టేట్‌(ఐఎస్‌) ప‌నేన‌ని బావిస్తున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాబూల్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి ఖలీద్‌ జద్రాన్‌ చెప్పారు.

కాగా.. ఆఫ్గానిస్థాన్‌లో అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూరైన సంద‌ర్భంగా ఇటీవ‌లే తాలిబ‌న్లు సంబ‌రాలు చేసుకున్నారు. అంత‌లోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

Next Story