Indian Embassy in Afghanistan urges all Indians to 'immediately' return before air services are shut. ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా ప్రాంతాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 10 Aug 2021 1:59 PM GMT
ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా ప్రాంతాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే..! దీంతో అక్కడి ఉన్న భారతీయులను కూడా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకనే భారత ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్లను తిరిగి వచ్చేయాల్సిందిగా కోరుతూ ఉంది. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం చెబుతోంది. ఆఫ్ఘన్ లో హింస క్రమంగా పెచ్చరిల్లుతోందని, త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆ లోపే భారత పౌరులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
"ఆఫ్ఘనిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రావిన్సులు, నగరాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులెవరైనా ఉంటే స్వదేశానికి వెళ్లే విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. విమాన సర్వీసులు నిలిచిపోకముందే భారత్ కు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి" అని ఆఫ్ఘన్ లో భారత దౌత్యకార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.