ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు అధ్య‌క్ష‌ బాధ్య‌త‌లు

India Takes Over UN Security Council Presidency For August. ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు ఆగ‌స్టు నెల అధ్య‌క్ష‌ బాధ్య‌త‌ల‌ను

By Medi Samrat  Published on  1 Aug 2021 11:23 AM GMT
ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు అధ్య‌క్ష‌ బాధ్య‌త‌లు
ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు ఆగ‌స్టు నెల అధ్య‌క్ష‌ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఈ మేర‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను భార‌త ప్ర‌తినిధి తిరుమూర్తి స్వీక‌రించారు. జులై నెల‌లో అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించిన‌ ఫ్రాన్స్ నుంచి భార‌త్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించింది.


సముద్ర సంబంధ భద్రత, శాంతి పరిరక్షణ, కౌంటర్ టెర్రరిజంలపై ఈ నెలలో భారత్ దృష్టి సారిస్తుంది. ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి నికొలస్ డీ రివియెరా ఈ మండలికి జూలైలో నాయకత్వం వహించారు. నికొలస్‌కు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు నెలకు అధ్యక్ష స్థానంలో భారత్ నిలుస్తుందని తెలిపారు. టీఎస్ తిరుమూర్తి ఓ వీడియో సందేశంలో, భారత దేశం ఉగ్రవాదంపై పోరాటంలో ముందు వరుసలో ఉందని తెలిపారు. కౌంటర్ టెర్రరిజంపై దృష్టి పెట్టడం కొనసాగిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఐరాసలో భారత్ పర్మినెంట్ మిషన్‌కు మార్గదర్శకత్వం చేస్తున్నారన్నారు.

భారత దేశంలో ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనైన్ ఇచ్చిన ట్వీట్‌లో, ఐరాస భద్రతా మండలి ప్రెసిడెన్సీని ఫ్రాన్స్ నుంచి భారత్ స్వీకరించడం సంతోషంగా ఉందని.. సముద్ర సంబంధ భద్రత, శాంతి పరిరక్షణ, కౌంటర్ టెర్రరిజం వంటి వ్యూహాత్మక అంశాలపై భారత దేశంతో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు. చట్టాల ఆధారంగా, బహుళ అంచెల వ్యవస్థల ద్వారా ప్రస్తుతం ఎదురవుతున్న అనేక సంక్షోభాలను ఎదుర్కొంటామని తెలిపారు.

భారత దేశం 2021 జనవరి 1 నుంచి భద్రతా మండలిలో నాన్ పర్మినెంట్ మెంబర్‌గా ఉంది. రెండేళ్ళపాటు ఈ పదవిలో ఉంటుంది. 2021-22 కాలంలో నాన్ పర్మినెంట్ మెంబర్‌గా మొదటిసారి భద్రతా మండలి ప్రెసిడెన్సీని భారత్ చేపట్టింది. భద్రతా మండలి ప్రెసిడెన్సీని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేశం చేపడుతుంది. శాశ్వ‌త‌, తాత్కాలిక స‌భ్య దేశాలు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌డుతున్నాయి. 2021-22 ఏడాదికి తాత్కాలిక స‌భ్య దేశంగా భార‌త్ ఎన్నికైంది. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోనూ భార‌త్ మ‌రోమారు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నుంది.


Next Story