గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఆరుగురిని హిసార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఆరుగురిని హిసార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఆమె ఐదుగురు స్నేహితులు ఉన్నారు. హిసార్లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్లో జ్యోతిని అరెస్టు చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో జ్యోతి తన సొంత యూట్యూబ్ ఛానెల్ని నడుపుతోంది.
2023 సంవత్సరానికి వీసా కోసం తాను పాకిస్థాన్ హైకమిషన్కు వెళ్లానని.. అక్కడ అహ్సన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ను కలిశానని జ్యోతి పోలీసులకు తెలిపింది. డానిష్ మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండుసార్లు పాకిస్థాన్లో పర్యటించినట్లు తేలింది.
అహ్సన్ ఉర్ రహీమ్ కోరిక మేరకు పాకిస్థాన్లో తన పరిచయస్తుడైన అలీ అహ్వాన్ను కలిశానని జ్యోతి చెప్పింది. అలీ అహ్వాన్ తన ప్రయాణానికి మరియు వసతికి ఏర్పాట్లు చేసాడు. అలీ అహ్వాన్.. పాక్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులను కలిసేలా చేశాడని విచారణలో తేలింది.
రానా షాబాజ్, షకీర్లను కూడా కలిశానని జ్యోతి చెప్పింది. ఎవరికీ అనుమానం రాకుండా షకీర్ మొబైల్ నంబర్ను తీసుకుని జట్ రంధావా పేరుతో తన మొబైల్లో సేవ్ చేసుకుంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత వాట్సాప్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ ద్వారా వారితో టచ్ లో ఉండడం ప్రారంభించింది. దేశ వ్యతిరేక సమాచారం వారికి చేరడం మొదలైంది.
పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతోనూ తనకు సంబంధాలున్నాయని విచారణలో జ్యోతి చెప్పింది. గూఢచర్యం ఆరోపణలపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ అహ్సన్ ఉర్ రహీమ్ ఉరఫ్ అలియాస్ డానిష్ను పర్సనా నాన్ గ్రేటాగా ప్రకటించింది. జ్యోతిని పర్సనా నాన్గ్రాటాగా కూడా ప్రకటించారు. ఆమెను అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి ఐదు రోజుల రిమాండ్కు తరలించారు.