చైనాను టెన్షన్ పెడుతున్న డెల్టా వేరియంట్
China authorities to test all Wuhan’s 11 million residents amid new Covid cases. కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు వదిలి వేడుక చూస్తున్న చైనాలో ఇప్పుడు
By Medi Samrat
కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు వదిలి వేడుక చూస్తున్న చైనాలో ఇప్పుడు మరో సారి కరోనా కలకలం మొదలైంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో చైనా అధికారులు టెన్షన్ పడుతూ ఉన్నారు. వుహాన్ నగరంలో ఇప్పుడు వైరస్ కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. దీంతో ఆ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు కరోనా పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. ఏడాదిన్నర తర్వాత వుహాన్ లో ఏడు కేసులు బయటపడ్డాయి. వలస కార్మికుల్లో ఆ కేసులను గుర్తించారు. చైనా మొత్తం లోనూ 61 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో దాదాపు అన్ని నగరాల్లో ఆంక్షలను మళ్లీ కఠినతరం చేశారు. ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆంక్షలు విధించారు.
చైనాలో ఇప్పటి వరకు 93,193 కేసులు నమోదు కాగా 4,636 మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నారు. వుహాన్లో ఒక సంవత్సరం తర్వాత కరోనా రోగి బయటపడడంతో కలకలం రేగింది. దాంతో ప్రతి పౌరుడికి పరీక్షలు జరుపనున్నారు. 2019 చివరలో వుహాన్ నగరంలో మొదటి కరోనా ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. ఆ తర్వాత దాని ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం ప్రారంభించింది. నగరవాసులందరిపై ప్రభుత్వం కరోనా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నట్లు వుహాన్ నగర సీనియర్ అధికారి లి టావో మంగళవారం మీడియాకు చెప్పారు. చైనాలోని 18 ప్రావిన్సుల్లో గత 10 రోజుల్లో 300 డొమెస్టిక్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇది డెల్టా వేరియంట్ అని తెలియడం.. అది మరింత వేగంగా పాకుతుందని తెలియడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.