అమెరికాలో టోర్నడో బీభత్సం.. 50 మందికి పైగా మృతి

At Least 50 Feared Dead After Tornado Hits US State Of Kentucky. ఆగ్నేయ అమెరికా రాష్ట్రమైన కెంటుకీలో తీవ్ర‌మైన‌ సుడిగాలుల‌(Tornado) కారణంగా 50 మంది

By Medi Samrat  Published on  11 Dec 2021 1:27 PM GMT
అమెరికాలో టోర్నడో బీభత్సం.. 50 మందికి పైగా మృతి

ఆగ్నేయ అమెరికా రాష్ట్రమైన కెంటుకీలో తీవ్ర‌మైన‌ సుడిగాలి(Tornado) కారణంగా 50 మంది పైగా చనిపోయారని తెలుస్తోంది. తుఫాను దేశంలోని అనేక ప్రాంతాలను ధ్వంసం చేసింద‌ని.. 200 మైళ్ల వేగంతో విరుచుకుప‌డ్డ‌ బలమైన సుడిగాలికు కెంటుకీలోని అనేక కౌంటీలు నాశనమయ్యాయని గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. తుఫాను తీవ్ర‌త‌కు ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఓ అమెజాన్ గిడ్డంగిలో దాదాపు 100 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారని స్థానిక మీడియా నివేదించింది.

సుడిగాలి తీవ్ర‌త‌కు 50 మందికి పైగా చనిపోయారని నేను భయపడుతున్నాను.. బహుశా 70 నుండి 100 మ‌ధ్య‌లో ఈ సంఖ్య‌ ఉంటుంది.. ఇది వినాశకరమైనదని బెషీర్ చెప్పాడు. ఇది కెంటుకీ చరిత్రలో అత్యంత తీవ్రమైన సంఘటన అని ఆయ‌న విలేక‌రుల‌తో అన్నారు. ఒక ఘ‌ట‌న‌లో కొవ్వొత్తి కర్మాగారం పైకప్పు కూలిపోయింది.. ఫలితంగా మేఫీల్డ్ నగరంలో సామూహిక ప్రాణనష్టం సంభవించిందని గవర్నర్ తెలిపారు. మేఫీల్డ్ లో తుఫాను కారణంగా భవనాలు కూలిపోయాయి. చెట్లు, స్థానభ్రంశం చెందిన ఇటుకలు వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇళ్ల అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయ‌న ప‌రిస్థితిని అభివ‌ర్ణించారు. అర్ధరాత్రికి ముందు నేను అత్యవసర పరిస్థితిని ప్రకటించానని బెషీర్ చెప్పారు. విద్యుత్తు అంతరాయం ఏర్ప‌డ‌టంతో పౌరుల‌ ప్రాణాలను రక్షించడానికి అనేక మంది రెస్క్యూ అధికారులను మోహరించినట్లు ఆయన తెలిపారు.

అమోజాన్ వేర్ హౌస్‌లో సుమారు వంద మంది కార్మికులు లోపల చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని కాపాడేందుకు శనివారం ఉదయం నుంచి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ భవనంలో కొద్దిభాగం శిథిలావస్థకు చేరుకుందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కూలిపోయిన భవనానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇల్లినాయిస్ రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర‌ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీలతో అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని, తాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


Next Story