ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

By Medi Samrat
Published on : 13 Jun 2025 5:57 PM IST

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 379 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్‌కు బాంబు బెదిరింపు గురించి సమాచారం అందింది. ఫుకెట్ విమానాశ్రయ అధికారులు తక్షణమే స్పందించి, ఎయిర్‌పోర్ట్ కంటింజెన్సీ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు. బాంబు బెదిరింపుల సమయంలో అనుసరించాల్సిన నిర్దేశిత అత్యవసర నిబంధనల ప్రకారం ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేసి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రాథమిక సోదాల్లో ఎలాంటి బాంబు లభ్యం కాలేదని తాజా సమాచారం ద్వారా తెలిసింది.

జూన్ 12వ తేదీ గురువారం నాడు లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు. ప్రమాద స్థలంలో పరిస్థితి గురించి వివరించిన తర్వాత, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్లారు. ప్రధానమంత్రి దాదాపు 20 నిమిషాలు సంఘటన స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద స్థలంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన వెంట కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

Next Story