భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న అన్ని OTT, డిజిటల్ ప్లాట్ఫామ్లకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ కు చెందిన కంటెంట్ ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇది సినిమాలు, వెబ్ షోలు, సంగీతం, పాడ్కాస్ట్లు, ఇతర డిజిటల్ మీడియా, ఉచిత లేదా సబ్స్క్రిప్షన్ ఆధారితమైనవాటికి వర్తిస్తుంది.
పాకిస్థాన్కు చెందిన పాటలు, సినిమాలు, వెబ్ సిరీస్లు, పాడ్కాస్ట్ల స్ట్రీమింగ్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పాకిస్థాన్కు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం, 2021లోని నిబంధనల ప్రకారమే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.