సొరంగంలో బస్సు - ట్రక్కు ఢీ.. భారీ పేలుడు, ఆరుగురు మృతి

6 Killed As Tunnel Fire After Bus Truck Collision In South Korea. సొరంగంలో బస్సు - ట్రక్కు ఢీ.. భారీ పేలుడు, ఆరుగురు మృతి

By అంజి  Published on  29 Dec 2022 2:00 PM GMT
సొరంగంలో బస్సు - ట్రక్కు ఢీ.. భారీ పేలుడు, ఆరుగురు మృతి

సౌత్‌ కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగం గుండా వెళ్తున్న బస్సు - ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. దీంతో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గ్వాచియాన్‌ నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారీ అగ్నిప్రమాదం కారణంగా బస్సు మరియు ట్రక్కు ప్రమాదంలో ఆరుగురు మరణించారని స్థానిక అగ్నిమాపక విభాగం తెలిపింది. సొరంగం గుండా వెళ్తుండగా బస్సు-ట్రక్కు ఢీకొట్టుకుని పేలుడు సంభవించింది.

ఈ పేలుడుతో సొరంగంలో మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో సొరంగం ప్రాంతం పొగ మేఘాలు కమ్ముకున్నాయి. గ్వాచియాన్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో మధ్యాహ్నం 1:50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు 50 ఫైరింజన్లతో 140 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. దాదాపు గంట సమయం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై గ్వాచియాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story