ఆత్మాహుతి దాడులకు 5000 మంది మహిళలను సిద్ధం చేస్తున్న ఉగ్రవాద సంస్థ..!

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ విస్తరిస్తోంది. జమాత్ ఉల్ మోమినాత్ మహిళా విభాగంలోకి ఇటీవల 5,000 మందికి పైగా మహిళలు రిక్రూట్ అయ్యారని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 4:35 PM IST

ఆత్మాహుతి దాడులకు 5000 మంది మహిళలను సిద్ధం చేస్తున్న ఉగ్రవాద సంస్థ..!

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ విస్తరిస్తోంది. జమాత్ ఉల్ మోమినాత్ మహిళా విభాగంలోకి ఇటీవల 5,000 మందికి పైగా మహిళలు రిక్రూట్ అయ్యారని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. దీనితో పాటు, ఈ మహిళలను సమూలంగా మార్చే పని జరుగుతోంది. జైష్ చీఫ్ మసూద్ అజర్ సోషల్ మీడియా పోస్ట్‌లో.. సంస్థ మహిళా విభాగంలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఇప్పుడు సంస్థ జిల్లా యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

అల్లాహ్ దయ వల్ల కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు ఈ సంస్థలో చేరారని అజహర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అడ్మిట్ అయిన వెంటనే తమ మానసిక స్థితి మారిపోయిందని, జీవిత లక్ష్యం అర్థమైందని పలువురు మహిళలు చెప్పారు. ఇప్పుడు వీరంతా కలిసి జిల్లా యూనిట్‌గా ఏర్పడనున్నారు. ప్రతి జిల్లాలో ఒక మేనేజర్ ఉంటారు. పని పంపిణీ చేయబడుతుందన్నాడు.

జమాత్ ఉల్ మోమినాత్‌ను జైష్ ప్రధాన కార్యాలయంలో మసూద్ అజర్ అక్టోబర్ 8న స్థాపించాడు. ఆ తర్వాత అందులో మహిళలను రిక్రూట్ చేస్తున్నారు. ఈ డ్రైవ్ కింద పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి నుండి మహిళలను ఉగ్రవాద సంస్థలో చేర్చుకున్నారు.

మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ జమాత్-ఉల్-మొమినాత్ అధినేత్రి. ఉగ్రవాది యూసుఫ్ అజార్ భార్య ఆమె. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాదియా భర్త యూసుఫ్ అజార్‌ను భారత సైన్యం హతమార్చింది. ఈ మహిళా తీవ్రవాద విభాగానికి చెందిన మరో మ‌హిళ‌, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫీరా, ఆమె కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించింది.

ఎన్‌డిటివి నివేదికల ప్రకారం.. జమాత్ ఉల్ మోమినాత్‌లో మహిళలను రిక్రూట్ చేస్తున్నారు. వారికి ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఆన్‌లైన్ తరగతులు 40 నిమిషాల నిడివితో ఉంటాయి. ఇందులో పాల్గొనేవారు రూ. 500 చెల్లించాలి. ఈ సంస్థ యొక్క ప్రణాళిక మహిళలను సమూలంగా మార్చడం.. ISIS, హమాస్, LTTE వంటి ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాద బ్రిగేడ్‌లను సిద్ధం చేయడం.

గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత జమాత్ ఉల్ మోమినాత్ వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్రదాడిలో 15 మంది చనిపోయారు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన డా. షహీన్ సయీద్‌కు జైషే ఉగ్రవాద విభాగం జమాత్ ఉల్ మోమినాత్‌తో సంబంధం ఉంది.

Next Story