కలరా విజృంభణ.. ఇప్పటివరకు 44 మంది మృత్యువాత..
44 cholera deaths reported in Cameroon. సెంట్రల్ ఆప్రికాకు చెందిన దేశం కామెరూన్ నైరుతి ప్రాంతంలోని ఆసుపత్రులు వందలాది మంది కలరా రోగులతో నిండిపోయాయి
By Medi Samrat Published on 25 March 2022 9:09 AM GMT
సెంట్రల్ ఆప్రికాకు చెందిన దేశం కామెరూన్ నైరుతి ప్రాంతంలోని ఆసుపత్రులు వందలాది మంది కలరా రోగులతో నిండిపోయాయి. ఇప్పటివరకూ 44 కలరా మరణాలు సంభవించాయని ఆరోగ్య అధికారి తెలిపారు. "ఇది చాలా తీవ్రమైన పరిస్థితి" అని ప్రాంత ప్రజారోగ్య చీఫ్ ఫిల్బర్ట్ ఎకో ఎకో జిన్హువా మీడియాతో అన్నారు. నైరుతి రీజనల్ డెలిగేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మార్చి 11 నుండి 23 వరకు ఈ ప్రాంతంలో 1,700 పైగా కలరా కేసులు నమోదయ్యాయి. బుధవారం, గురువారం రెండు రోజులలో కనీసం 14 మంది ఈ వ్యాధితో మరణించారు. గత రెండు వారాల్లో మరణాల సంఖ్య 44కి పెరిగిందని ఎకో జిన్హువా తెలిపింది.
"మా ప్రాంతంలో అత్యధికంగానే కేసులు ఉన్నాయి. మూడు ప్రధాన చికిత్సా కేంద్రాలు పూర్తిగా శక్తివంతంగా పనిచేస్తున్నాయి" అని ఎకో జిన్హువా అన్నారు. అయితే.. ఆసుపత్రుల్లో రోగులకు సరిపడా పడకలు లేవని.. వీరిలో కొందరు టెంట్లలో లేదా సౌకర్యాల ప్రాంగణంలో కారిడార్ల వెంబడి ఉంటున్నారని ఆయన అన్నారు. సముద్రతీర రిసార్ట్ పట్టణం లింబేలో పరిస్థితి భయంకరంగా ఉందని.. బుధవారం కనీసం 400 ఇన్ఫెక్షన్లు కనుగొనబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశుభ్రమైన నీరు, బహిరంగ మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రధానంగా వ్యాధి వ్యాప్తి చెందిందని ఎకో జిన్హువా అన్నారు. బుధవారం రీజియన్ గవర్నర్.. బెర్నార్డ్ ఒకలియా బిలాయ్ కలరా ప్రభావిత ప్రాంతాల్లో 30 రోజుల్లో మరుగుదొడ్లు నిర్మించాలని స్థానిక అధికారులను కోరారు.