2019లో తెలంగాణలో అగ్రశ్రేణి వినూత్న పారిశ్రామికవేత్తలు వీళ్లే..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Dec 2019 12:00 PM GMTహైదరాబాద్ : రోజువారీ జీవితంలో ఎదురయ్యే సాధారణమైన సమస్యల్ని, సవాళ్లను ఎంపిక చేసుకుని తమదైన వినూత్న శైలిలో వాటికి సమాధానాలను సాధించారు. ఫలితంగా వ్యవసాయం నుంచి దుస్తులవరకూ, పర్యావరణంనుంచి ఇంజినీరింగ్ వరకూ అనేక రంగాల్లో కొత్త స్టార్టప్ లు పుట్టుకొచ్చాయి. 2019లో అకుంటితమైన దీక్షాదక్షతలతో ఈ అంకుర పరిశ్రమల్ని అగ్రపథంలో నిలపడమే కాక అందరికీ ఆదర్శంగా నిలచిన నవతరం పారిశ్రామిక వేత్తల విజయగాథల్ని ఇప్పుడు చూద్దాం. అద్భుతాలను సాధించిన ఎంతోమంది సాధారణమైన వ్యక్తులు అగ్రపథంలో నిలచిన పారిశ్రామిక వేత్తలుగా ఎదిగినవారి సక్సెస్ స్టోరీస్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చేసిన అధ్యయనంలో వెలుగుచూశాయి.
1. హరీష్ గాడి, సాయి తేజ :
హైదరాబాద్ కు చెందిన 23 ఏళ్ల హరీష్ గాడి తన మిత్రుడు శ్రీపురం సాయితేజతో కలసి తయారు చేసిన సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని పొందింది. అత్యవసర పరిస్థితుల్లో మహిళలను ప్రమాదాలనుంచి కాపాపడం ఈ గాడ్జెట్ ప్రత్యేకత. ఈ గాజుని ధరించిన మహిళలు ఒక నిర్ణీత కోణంలో గాజును తిప్పినట్టైతే దాడిచేయడానికి వచ్చినవాళ్లకు కరెంట్ షాక్ తగులుతుంది.
అది మాత్రమే కాక దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ కీ, సదరు ప్రమాదంలో ఉన్న మహిళ బంధువులకూ ఈ గాజు యుద్ధ ప్రాతిపదికన ప్రమాద సంకేతాలను పంపుతుంది. తాజాగా మహిళలపై జరుగుతున్న దాడులు ఎన్నో వెలుగులోకి వచ్చిన నేపధ్యంలో వాళ్లకు రక్షణ కల్పించే ఈ గాజును రూపొందించామని ఈ నవతరం ఎంటర్ ప్రెన్యువర్లు చెబుతున్నారు. వీళ్లు రూపొందించిన ఈ అద్భుతమైన గాడ్జెట్ కు విశేషమైన స్పందన లభిస్తోందిప్పుడు.
2. జె.రమ :
పాత దుపట్టాలను, చీరల్ని అందమైన బ్యాగులుగా మలచే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. పనికిరాని, వాడి పారేసే చీరలు, దుపట్టాలను రంగురంగుల అందమైన బ్యాగులుగా తయారుచేయడంవల్ల పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు తప్పుతుందని నిరూపించారీ 54 సంవత్సరాల నవతరం నారీమణి.
40 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న పోలీ ఎథిలీన్ బ్యాగుల్ని మార్కెట్లో కనిపించకుండా చేయడమే తన లక్ష్యమని మదీనాగూడ వాసియైన రమ చెబుతున్నారు. తాను చేపట్టిన ఈ కొత్త విధానానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తే కొంతలో కొంతైనా ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని తద్వారా పర్యావరణానికీ, సమాజానికీ ఎంతో మేలు కలుగుతుందనీ చెబుతున్నారీమె.
3. స్నేహలత శిర్పా :
ఈమధ్య కాలంలో ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ప్రధానమైన అంశం కాలుష్య నివారణ. గాల్లో ఉండే దుమ్మూ ధూళి ఎంత తలుపులు వేసిన పెట్టినాసరే ఇంట్లోకి జొరబడ్డం ఖాయం. ఇంట్లో ఎటువైపు చూసినా దుమ్మే కనిపిస్తుంది. దీనికి సరైన పరిష్కారాన్ని కనుక్కుందీ ఆదిలాబాద్ కి చెందిన నవతరం మహిళ. మైక్రో ఫైబర్ ని ఆధారం చేసుకుని తను రూపొందించిన కవచ్ అనే సరికొత్త రక్షణ కవచం కనీసం ఇంట్లో దుమ్మూధూళీ లేకుండా కుటుంబ సభ్యులందరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలిగేలా చేస్తుంది.
పర్యావరణానికి మేలు కలిగించే అతి చవకైన సాధనాన్ని తను రూపొందించగలిగానని ఆమె చెబుతున్నారు. సాధారణంగా ఇంట్లో ఉండే మామూలు ఎయిర్ కూలల్లకు దీన్ని అమర్చితే ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. సాధారణంగా మార్కెట్లో దొరికే ఇదే తరహా ఎయిర్ ఫ్యూరిఫయర్లు చాలా ఖరీదు. కానీ ఈమె రూపొందించిన ఈ సరికొత్త ఎయిర్ ఫ్యూరిఫయర్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది.
4. బుడ్డే విజయ్ :
అవసరమే అన్ని మార్గాల్నీ చూపిస్తుందని వ్యవసాయదారుడు బుడ్డే విజయ్ బలంగా నమ్ముతాడు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఈ నవతరం రైతు పొలంలో చాలా తేలికగా విత్తనాలు నాటుకోవడానికీ, ఎరువులు, పురుగు మందులు వేయడానికి ఉపకరించే మినీ ట్రాక్టర్ ని తయారుచేశాడు. జొన్నమొక్కలకు ఉపయోగించే సీడ్ డ్రిల్ కు మార్పులు చేర్పులు చేయడం ద్వారా విజయ్ ఈ సరికొత్త వ్యవసాయ పరికరాన్ని రూపొందించడం జరిగింది.
5. యాకర్ గణేష్ :
కేవలం చిన్న పాటి ప్రోత్సాహం, ఆధునిక ఆలోచనలతో కూడిన మనస్తత్త్వం ఉండే చాలు పదిమందికీ ఉపయోగపడే పరికరాలను ఎన్నింటినో రూపొందించడానికి వీలవుతుందని నిరూపించాడు 21 సంవత్సరాల వయసున్న యాకర్ గణేష్. ఇతని తల్లిదండ్రులిద్దరూ వరంగల్ లో రోజు కూలీలు. సరిగా వినిపించని వాళ్లకోసం గణేష్ ఓ ప్రత్యేకమైన వినికిడి పరికరాన్ని తయారు చేశాడు. మార్కెట్లో అందుబాటులో ఉన్న వినికిడి పరికరాలు చాలా ఖరీదైనవి. కానీ గణేష్ రూపొందించిన సరికొత్త వినికిడి పరికరం మాత్రం సామాన్యులకుకూడా అందుబాటులో ఉంటుంది.
ఓ చిన్న డి.సి మోటార్, ఇంకా కొన్ని చిన్న చిన్న వైర్లతోనే గణేష్ ఈ సరికొత్త వినికిడి పరికరాన్ని రూపొందించాడు. ఎలక్ట్రానిక్ పరికరాలను రూపొందించడంలో గణేష్ కు చిన్నప్పట్నుంచీ ఆసక్తి ఎక్కువ. ఒకరోజున తన తల్లి సరిగా వినిపించనివాళ్లకోసం ఏదైనా పరికరాన్ని తయారుచేయొచ్చుగా అని అడిగింది. తల్లి మాటల్ని సీరియస్ గా తీసుకున్న గణేష్ కొద్దిపాటి ప్రయత్నాలతోనే అద్భుతమైన పరికరాన్ని రూపొందించాడు.
6. కె.వెంకటయ్య చిన్నదారపల్లి :
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతు వెంకటయ్య వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న విషయాన్ని గ్రహించాడు. అతి తక్కువ ఖర్చుతో పొలంలో ఎక్కువ పని చేసిపెట్టగల అధునాతన వ్యవసాయ పరికరాన్ని రూపొందించాడు. ఇది ఓ ఇంజీన్ సాయంతో నడుస్తుంది. ఈ యంత్రం విత్తనాలు నాటడానికి, ఇతర అవసరాలకూ చిన్నకమతాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తను చెబుతున్నాడు.
తన చిన్నతనంలో తమకు ఒక ఎద్దుల జత ఉండేదనీ, దాని సాయంతోనే తమ పొలంలో అన్ని పనులు చకచకా జరిగిపోయేవనీ, ప్రస్తుతం తనకు ఉన్న భూమిలో వ్యవసాయం చెయ్యడానికి ఒక ఎద్దును కొనేందుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత లేదని, ఆ అవసరమే తనకు సరికొత్త ఆలోచనలను కల్పించిందనీ, కొత్త పరికరాన్ని రూపొందించడానికి మార్గాన్ని సుగమం చేసిందనీ చెబుతున్నాడు. తాను రూపొందించిన ఈ సరికొత్త పరికరానికిగానూ ఇంటిటా ఇన్నోవేటర్ అవార్డునుకూడా అందుకున్నాడీ సన్నకారు రైతు.
7. పసరగొండ రామకృష్ణ :
34 సంవత్సరాల పెద్దపల్లికి చెందిన ఈ ఇంజినీరు 2019లో బెస్ట్ స్టేట్ ఇన్నోవేటర్ అవార్డును అందుకున్నాడు. బుల్ డోజర్ ట్రాన్స్ మిషన్ కోసం ఉపయోగించే జాయ్ స్టిక్ లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చినందుకు తనకీ అవార్డ్ వచ్చింది. భారీ పనులకు ఉపయోగించే పెద్ద పెద్ద వాహనాలు తరచూ కేవలం గేర్లు సరిగా పనిచెయ్యకపోవడం వల్ల బ్రేక్ డౌన్ అవుతుంటాయని రామకృష్ణ చెబుతున్నాడు.
ఆ సమస్య లేకుండా చేసేందుకే తాను ఈ కొత్త పరికరాన్ని కనిపెట్టాననీ రామకృష్ణ చెబుతున్నాడు. సింగరేణి కాలరీస్ లో పనిచేసే రామకృష్ణ తన కళ్లముందే కేవలం ఒక చిన్న లోపం కారణంగా బ్రేక్ డౌన్ అవుతున్న హెవీ వెహికల్స్ ని చూశాడు. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించి సక్సెస్ సాధించాడు.
8. ఉదయ్ నదివాడె – రాజేష్ సరఫ్ :
హైదరాబాద్ లో చాలా మంది ఎదుర్కొనే సమస్య హార్డ్ వాటర్. ఈ సమస్యను తేలికగా పరిష్కరించే “డి కాల్ హార్ట్ వాటర్ సాఫ్ట్ నర్ “ కనుక్కున్నారు ఈ ఔత్సాహిక ఇంజినీర్లు. వీళ్లు రూపొందించిన పరికరం పనిచెయ్యడానికి విద్యుచ్ఛక్తి ఏమాత్రం అవసరం లేదు. ఈ పరికరాన్ని కనిపెట్టినందుకుగానూ 2019లో వీళ్లు సిఐఐ తెలంగాణ ఇండస్ట్రీస్ అవార్డును అందుకున్నారు.