ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70శాతం పైగా భారత్ లోనే.. గ్లోబల్ టైగర్ డే
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 July 2020 7:40 AM GMTజూలై 29న గ్లోబల్ టైగర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని గత ఏడాది చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం ఇటీవలే భారత ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. 2006 లో దేశంలో 1411 పులులు ఉండగా.. 2010లో 1706, 2014లో 2226 పులులు ఉన్నాయి. 2018 నాటికి ఆ సంఖ్య 2967 కు చేరుకుంది. తక్కువ సమయంలోనే భారత్ లో పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 2018లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పులుల గణన గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. కెమెరాల ద్వారా అతి పెద్ద వన్యప్రాణి సర్వేగా దీనిని గుర్తిస్తూ గిన్నిస్బుక్ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అడవుల్లో 25 వేల కెమెరా ట్రాపులను అమర్చి 35 మిలియన్ చిత్రాలను తీయడం జరిగింది. ఈ ఫోటోలన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్కాన్ చేశారు. ఇది ప్రపంచంలోనే భారీ కార్యక్రమమని.. పులుల పర్యవేక్షణకు సంబంధించి వినూత్నమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం ‘మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకొలాజికల్ స్టాటస్’ను ప్రభుత్వం ప్రారంభించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
Under the leadership of PM @narendramodi, India fulfilled its resolve to double tiger numbers 4 years before the target through #SankalpSeSiddhi. @GWR @PMOIndia pic.twitter.com/ChnPkCEzUG
— Prakash Javadekar (@PrakashJavdekar) July 11, 2020
పులుల సంఖ్య రెట్టింపు చేయడానికి పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ నాలుగేళ్లు ముందుగానే చేరుకుందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గత గణన ప్రకారం దేశంలో ఇప్పుడు 2,967 పులులు ఉన్నాయి. 2022 నాటికి దేశంలో పులుల సంఖ్య రెట్టింపయ్యేలా చేస్తామని 2010లో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత్ తీర్మానించుకోగా ఇప్పుడు అంతకు నాలుగేళ్లు ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నట్లు ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్ రిజర్వ్లలో ఉత్తరాఖండ్లో కార్బెట్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్హోల్లో 127, బందీపూర్లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు తాజా నివేదిక అంచనావేసింది. నాగార్జునసాగర్(ఏపీ) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 43 పులులు సంచరిస్తుండగా.. ఇందులో టైగర్ రిజర్వ్లోపలే 38 ఉన్నట్టు నివేదిక తెలిపింది. తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 9 ఉన్నాయి. రిజర్వ్ లోపలి ప్రాంతంలో 7 వున్నాయి.. కవ్వాల్ టైగర్ రిజర్వ్లో 1 పులి ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల వయస్సు తక్కువని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో పులులు ఉన్నాయి. ఈ దేశాల్లోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్ వంటి దేశాల్లో పులులు బాగా కనిపిస్తాయి.
దేశంలో ఉన్న అన్ని టైగర్ రిజర్వ్లూ నాణ్యతాపరంగా బాగున్నాయని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పులుల సంరక్షణ కోసం ఇతర దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ ఈ సంరక్షణ చర్యలకు నేతృత్వం కూడా వహిస్తుందన్నారు. అడవుల కొరత, సమృద్ధిగా వర్షపాతం లేకపోయినప్పటికీ భారత్ పులుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలతో ప్రపంచ జీవవైవిధ్యంలో 8% పెరిగిందన్నారు.